Mani Shankar Aiyar: కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిపై మాట్లాడుతూ.. ‘‘భారత్ పాక్ విభజన యొక్క పరిష్కారం కాని సమస్య’’తో ముడిపెడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, అయ్యర్ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. బీజేపీ నేత నళిన్ కోహ్లీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత, దేశ మొదటి ప్రధాని నెహ్రూ అతడి విధానాలను అయ్యర్ ప్రశ్నల్ని లేవనెత్తుతున్నారని అన్నారు.
‘‘ఆయన చాలా సీనియర్ మరియు అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు. ఆయన దశాబ్దాలుగా దృఢమైన కాంగ్రెస్ వాది మరియు ముఖ్యమైన పదవులను నిర్వహించారు… ఉగ్రవాద సమస్యలను, 1947 నాటి పరిష్కారాలు లేని సమస్యలను ఆయన ప్రస్తావించారు. ఒక విధంగా, 1947లో అనేక విషయాలు పరిష్కరించబడలేదని నిజాయితీగా ఒప్పుకున్నట్లు అవుతుంది. ఆయన పండిట్ జవహర్లాల్ నెహ్రూ,ఆయన విధానాలకు వ్యతిరేకంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు’’ అని అన్నారు.
Read Also: Miss India Nandini Gupta: రామప్పను సందర్శించిన మిస్ ఇండియా నందిని గుప్తా.. ఆలయంలో ప్రత్యేక పూజలు
ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత మాట్లాడుతూ.. భారతదేశంలో ముస్లింలు నేడు అంగీకరించబడ్డారా..? ప్రేమించబడ్డారా..? లేదా విభజన సమయంలో ఉన్న పరిస్థితులే ఇప్పుడు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. విభజన సమయంలో పరిష్కారం కాని ప్రశ్నలు, 1971 పాకిస్తాన్తో జరిగిన యుద్ధం నాటి పరిణామాలు ఏప్రిల్ 22న పహల్గామ్ లో జరిగిన భయంకరమైన విషాదంలో ప్రతిబింబిస్తున్నాయా.? అని అన్నారు. ఉపఖండంలోని ముస్లింల రక్షకుడిగా ఉండాలనే పాకిస్తాన్ కల 1971 యుద్ధం తర్వాత ముగిసిందని అన్నారు.
ఈ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. విభజన విషాదానికి కాంగ్రెస్ బాధ్యత వహించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు అమాయకపు పౌరుల్ని దారుణంగా హత్య చేశారని, బాధితుల అంత్యక్రియలు ఇంకా చల్లబడలేదని, అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ పట్ల ప్రేమను ప్రదర్శి్స్తూనే ఉన్నారని అన్నారు. “భారతదేశ చరిత్రలో విభజన ఒక విపత్తు, రెండు మిలియన్ల మంది మరణించారు . 20 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. ఆ విషాదానికి కాంగ్రెస్ బాధ్యత వహిస్తుంది. మణిశంకర్ అయ్యర్ ప్రకటన పహల్గామ్ దాడి బాధితుల గాయాలను పెంచడం లాంటిది” అని ఆయన అన్నారు.