BJP vs Congress: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయం మొదలైంది. కాంగ్రెస్ ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ..‘‘అవసరమైన సమయాల్లో మిస్ అవుతారు’’ అని కామెంట్ చేసింది. ప్రధానిని సూచించే ఒక ఫోటోని పోస్ట్ చేసి, దానికి తల లేకుండా ఉంచింది. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అఖిల పక్ష సమావేశానికి ప్రధాని మోడీ గైర్హాజరు కావడాన్ని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎత్తిచూపారు. కాంగ్రెస్ నేతల కామెంట్స్పై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్తో కుమ్మకైందని, రాహుల్ గాంధీ రహస్య వ్యూహాల మేరకు ఇలా చేస్తున్నారని అన్నారు. గతంలో ప్రధాని మోడీ చేసిన ‘‘రక్తం నీరు కలిసి ప్రవహించలేదు’’ అనే వ్యాఖ్యల్ని ఠాకూర్ గుర్తు చేశారు. ‘‘కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు పాకిస్తాన్ భాష మాట్లాడటం, పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడం నాకు అర్థం కాదు. భారతీయుల్ని చంపినప్పుడు వారి రక్తం మరగదా..? ప్రతీకారం తీర్చుకోవాలని అనిపించదా..?’’ అని ప్రశ్నించారు.
తన ముస్లిం ఓటు బ్యాంక్ కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీజేపీ నేత అమిత్ మాల్వియా ఆరోపించారు. కాంగ్రెస్ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదని చెప్పారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ నుంచి కాంగ్రెస్కి ఆదేశాలు వస్తున్నాయి’’ అని ఆరోపించారు. కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్టుని పాకిస్తాన్ రాజకీయ నాయకుడు వాడుకున్నాడని అన్నారు.