మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై స్పందించిన శివసేన చీఫ్, ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కరోనా బారినపడిన ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉండగా.. అక్కడి నుంచే సోషల్ మీడియా వేదికగా మహారాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.. శివసేన సిద్ధాంతాలతో పాటు రెబల్ ఎమ్మెల్యేలు చేసిన అన్యాయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూమతం, శివసేన ఎప్పుడూ కలిసే ఉంటాయని స్పష్టం చేసిన ఆయన.. రెబల్ ఎమ్మెల్యేలు కోరితే సీఎంగా తప్పుకుంటానని ప్రకటించారు. అయితే, సొంత ఎమ్మెల్యేలే వద్దనడం బాధగా ఉందన్నారు.. ఎమ్మెల్యేలు కోరితే రాజీనామా చేసేందుకు సిద్ధమని.. నా రాజీనామా లేఖ సిద్ధంగా ఉందని తెలిపారు ఉద్దవ్ థాక్రే.. రాజకీయ సంక్షోభంలో ఒకవేళ ప్రభుత్వం పడిపోయినా ఎన్నికలకు వెళ్లి మళ్లీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఉద్దవ్.. అంతేకాదు, శివసేన చీఫ్గా దిగిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని.. అయితే, తాను చేసిన తప్పేంటో రెబల్ ఎమ్మెల్యేలు చెప్పాలని కోరారు.
మరోవైపు, తిరుగుబాటు చేసిన మంత్రి ఏక్నాథ్ షిండేతో పాటు రెబల్ ఎమ్మెల్యేలను చర్చలకు ఆహ్వానించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే, నేను నమ్మక ద్రోహానికి గురయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయనే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఇలా చేయడం ఏంటి? అని ప్రశ్నించారు. నాతో ఏక్నాథ్ షిండే నేరుగా మాట్లాడాలని సూచించారు ఉద్దవ్.. ఇక, శివసేన సైనికుడు ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చు అని వ్యాఖ్యానించారు.. అయితే, అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా లేను అని కూడా చెప్పుకొచ్చారు. కాగా, ఇప్పటికే ఏకనాథ్ షిండే తమ నాయకుడని ప్రకటిస్తూ రాష్ట్ర గవర్నర్, శాసనసభ ఉపాధ్యక్షుడికి లేఖ రాశారు 34 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు, అంతేగాకుండా, ఏకనాథ్ షిండేను శివసేన శాసనసభాపక్ష నాయకుడుగా నియమిస్తూ తీర్మానం కూడా చేశారు.. సిద్ధాంతపరంగా శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలపడం పట్ల శివసేన కార్యకర్తల్లో విపరీతమైన అసంతృప్తి, వ్యతిరేకత వచ్చిందని తీర్మానంలో పేర్కొన్నారు..
ఇక, నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ ముఖ్ లాంటి మంత్రుల అవినీతి, ఇతర పాలనాపరమైన సమస్యలు, అంశాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తీర్మానం చేశారు శివసేన రెబల్ ఎమ్మెల్యేలు.. 55 మంది శివసేన ఎమ్మెల్యేల్లో 40 మంది ఎమ్మెల్యేలతో పాటు, ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా రెబల్ నేత ఏక్నాథ్ షిండేకు మద్దతుగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.. శివసేన బలం 55 మంది ఎమ్మెల్యేలు కాగా.. 40 మంది తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు రాజీనా చేస్తే.. ఆ పార్టీ బలం 15కు పడిపోనుంది.. ఎన్సీపీ, కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివసేనకు బయటి పార్టీల కంటే.. సొంత పార్టీలోనే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం జీర్ణించుకోలేకపోతున్నారు.