Chandrayaan-3: భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపడుతోంది. 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 పాక్షికంగా సక్సెస్ అయింది. అయితే ఈ సారి ఎలాగైనా రోవర్ ని చంద్రుడిపై దించాలని భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) గట్టి పట్టుదలతో ఉంది. జూలై 14న శ్రీహరికోట షార్ నుంచి ప్రయోగం జరుగనుంది. లాంచ్ వెహికల్ మార్క్-III (LVM-III)లో చంద్రయాన్ -3ని జాబిల్లిపైకి పంపనుంది. వచ్చే శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రయోగం జరగనుంది. నాలుగేళ్ల క్రితం 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 విషయంలో చివరి నిమిషంలో రోవర్ తో ల్యాండర్ చంద్రుడిపై దిగే సమయంలో అదుపుతప్పి కూలిపోయింది. ఈసారి ఆ ప్రమాదం జరగకుండా ఇస్రో అన్ని చర్యలు తీసుకుంటుంది.
Read Also: Pubg Love Story: నేను పాకిస్తాన్ వెళ్లనంటున్న పబ్జీ ప్రియురాలు.. ఏం చేశారంటే?
చంద్రుడిపైకి ఎలా ప్రయాణిస్తుంది..?
2019లో చంద్రయాన్ -2 చంద్రుడిని చేరేందుకు దాదాపుగా 48 రోజులు పట్టింది. ఆపోలో మిషన్ వంటి ప్రయోగాలు భారీ రాకెట్ల ద్వారా నేరుగా భూమి గురుత్వాకర్షణ శక్తిని తప్పించుకుని చంద్రుడి వైపు వెళ్తుంటాయి. అయితే రోవర్లు, ప్రోబ్ ల విషయంలో ఈ ప్రమాణం వేరేలా ఉంటుంది. భూమి నుంచి ప్రయోగించిన తర్వాత కొన్ని రోజలు పాటు భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తూ, దశల వారిగా కక్ష్యను పెంచుకుంటూ, వేగాన్ని పెంచుకుంటూ.. భూమి గురుత్వాకర్షణ శక్తిని తప్పించుకుని చంద్రుడి వైపు ప్రయాణిస్తాయి. ట్రాన్స్-లూనార్ ఇంజెక్షన్లు (TLIలు) అని పిలువబడే కక్ష్య విన్యాసాలగా పిలువడే ఈ చర్యల ద్వారా చంద్రుడి పథంలోకి వెళ్తుంది. ఇప్పుడు ప్రయోగించే చంద్రయాన్-3 కూడా ఇదే తరహాలో భూమి చుట్టు కొన్ని రోజులు పరిభ్రమించనుంది.
దీనికి కొన్ని రోజులు సమయం పడుతుంది. భూమి చుట్టు తిరుగుతున్న సమయంలో నిర్ధిష్ట కక్ష్యలోకి మారేందుకు అంతరిక్ష నౌకలో ఉండే ఇంధనాన్ని కొన్ని సెకన్ల పాటు మండించి కక్ష్యను పెంచుతారు. ఇలా క్రమక్రమంగా కక్ష్యను పెంచుకుంటూ పోతారు. చివరికు భూమి గురుత్వాకర్షణ శక్తి నుంచి బయటకు వెళ్తుంది.
ఇక చంద్రుడి కక్ష్యలోకి అంతరిక్ష నౌకను ప్రవేశపెట్టడం కూడా చాలా కష్టతరమైన ప్రయోగం. చంద్రుడి దగ్గరకు చేరగానే నౌక వేగాన్ని తగ్గించేందుకు మళ్లీ అందులో ఉండే ఇంజన్లను మండించి చంద్రుడి కక్ష్యలో చేరేలే విన్యాసాలు చేయిస్తారు. లూనార్ ఆర్బిట్ ఇన్సర్షన్ (LOI) అని పిలువడే విన్యాసాలు ద్వారా నౌకను చంద్రుడిపైకి చేరేలా చేస్తారు. దీని కోసం క్రమంగా దశల వారీగా చంద్రయాన్-3 వేగాన్ని తగ్గించుకుంటూ కక్ష్యను తగ్గిస్తారు.
ఎంత సమయం పడుతుంది..?
చంద్రుడు భూమికి మధ్య ఉన్న 3,84,400 కిలోమీటర్ల దూరాన్ని చేరడానికి చంద్రయాన్-3కి దాదాపుగా 48 రోజుల సమయం పడుతుంది. జూలై 14న ప్రయోగిస్తే ఆగస్టు చివరి నాటికి అంటే ఆగస్టు 23 లేదా 24 నాటికి చంద్రుడిని చేరుకోవచ్చు. 2019లో ప్రయోగించిన చంద్రయాన్ 2 జూలై 22న భూమి పై నుంచి వెళ్తే ఆగస్టు 20, 2019న చంద్రుడి కక్ష్యను చేరుకుంది.