శనివారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో గతంలో ప్రవేశపెట్టిన ఉచిత రేషన్ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ నిర్ణయంతో ఈ ఏడాది సెప్టెంబర్ దాకా పేదలకు ఉచిత రేషన్ అందనుంది. ఈ పథకం కింద దేశంలోని 80 కోట్ల మందికి లబ్ధి చేకూరుతోంది. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పేరిట కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా దేశంలోని అర్హులైన వారికి నెలకు అదనంగా 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలను కేంద్రం సరఫరా చేస్తోంది.
కాగా తొలుత ఉచిత రేషన్ పథకాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రెండోసారి సీఎం కావడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని ఉచిత రేషన్ను పొడిగిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే కేంద్రం ఈ పథకాన్ని ఆరు నెలల పాటు పొడిగించడంతో యూపీ ప్రభుత్వంపై ఈ పథకం భారం పడదు.