ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి మమతా బెనర్జీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కేంద్రం ఎన్ని ఎత్తుగడలు వేసిన బెంగాల్ లో మమతా బెనర్జీకే ప్రజలు పట్టం కట్టారు. అయితే ఆ ఎన్నికల ముందు.. టీఎంసీ కీలక నేతలను లాగేసుకున్న బీజేపీ.. మమతా బెనర్జీని ఒంటరి చేసింది. అయినప్పటికీ వెనుకడుగు వేయకుండా ఒంటిచేత్తో తన పార్టీని విజయ తీరాలకు చేర్చింది మమతాబెనర్జీ. అయితే ఆమె విజయం తర్వాత బెంగాల్లో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఎన్నికల ముందు బీజేపీలోకి వెళ్ళిన నాయకులు అంతా ఇప్పుడు టీఎంసీ బాట పడుతున్నారు. ఇప్పటికే పలుగురు నాయకులు బిజేపికి షాక్ ఇవ్వగా.. తాజాగా మరో షాక్ తగిలినట్లు సమాచారం అందుతోంది.
బీజేపీ కీలక నేత ముకుల్ రాయ్ మళ్లీ టిఎంసి గూటికి చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన ముకుల్ రాయ్ ఆర్బాటంగా బిజెపిలో చేరారు. అయితే తాజాగా మనసు మార్చుకున్న ముకుల్ రాయి.. బీజేపీ నుంచి టిఎంసిలో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ కానున్నారని సమాచారం. ఈ సమావేశానికి ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా పాల్గొంటారని తెలుస్తోంది.