Congress: అస్సాం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. అస్సాం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపెన్ బోరా రాజీనామా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ పరిణామం తర్వాత అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ, బోరాను వ్యక్తిగతంగా కలువనున్నట్లు ప్రకటించారు. బోరా రాజీనామాపై హిమంత మాట్లాడుతూ.. ‘‘ భూపెన్ బోరా అస్సాం కాంగ్రెస్ లో అట్టడుగు స్థానం నుంచి ఎదిగిన ప్రముఖ హిందూ నేత. ఆయన ఆహ్వానం మేరకు ఈ సాయంత్రం ఆయనను కలవనున్నాను. బీజేపీలో ఆయన చేరితే అస్సాం, దేశ సేవలో మరింత బలం చేకూరుతుంది’’ అని అన్నారు.
Read Also: Valentine’s Day Shocker: భార్యతో వాలెంటైన్స్ డే డిన్నర్, రాత్రి మర్డర్..
అస్సాం కాంగ్రెస్ చీఫ్గా గౌరవ్ గొగోయ్ బాధ్యతలు తీసుకునే ముందు 2021-25 వరకు అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడిగా బోరా పనిచేశారు. ప్రస్తుతం, అస్సాం కాంగ్రెస్లో గొగోయ్ ఆధిపత్య ధోరణి కారణంగానే బోరా రాజీనామా చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. బోరా తన రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. 32 ఏళ్లగా పార్టీ కోసం పనిచేస్తున్నా, ఇప్పుడు విస్మరించారని, తనకు తగిన గౌరవం కల్పించలేదని ఆయన ఆరోపించారు.
బోరా రాజీనామా ద్వారా కాంగ్రెస్లో సాధారణ వ్యక్తి అభివృద్ధి చెందలేదనే సందేశాన్ని పంపిందని, బోరాను బీజేపీలోకి స్వాగతిస్తున్నామని, బీజేపీలో చేరాలని నిర్ణయించుకుంటే ఆయనకు సురక్షిత స్థానం నుంచి ఎన్నికయ్యేలా చేస్తామని హిమంత చెప్పారు. సీఎం హిమంత తనను కలుస్తాననే వ్యాఖ్యలపై బోరా స్పందిస్తూ.. ఏ ముఖ్యమంత్రి అయినా తన ఇంటికి వస్తే అది తనకు గర్వకారణం అని బోరా అన్నారు. ఇదిలా ఉంటే, రాజీనామాపై పునరాలోచన చేయాలని గొగోయ్, ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్, దేబబ్రత సైకియాతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కోరారు.