Chennai: రికార్డు స్థాయి ఎండల తర్వాత చెన్నై ప్రజలకు ఉపశమనం లభించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాతావరణం కాస్త చల్లబడింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్, చెంగల్పట్లు ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడి భారీ వర్షం కురిసింది. దీంతో ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది.
Read Also: Balakrishna New Movie: బాలకృష్ణ కొత్త సినిమా.. స్టార్ హీరోయిన్కు ఛాన్స్! ఇది నాలుగోసారి
భారీ వర్షాల కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెన్నైకి రావాల్సిన ఆరు అంతర్జాతీయ విమానాలను బెంగళూర్ కి మళ్లించారు. వర్షాల కారణంగా డజనుకు పైగా అంతర్జాతీయ విమానాలు బయలుదేరడం ఆలస్యమైంది. చెన్నైలోని మీనంబాక్కంలో సోమవారం ఉదయం 5.30 గంటల వరకు 13.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. వాహనాలు, ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సోమవారం ఉదయం 10 గంటల వరకు ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చెన్నైతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు జూన్ 21 వరకు కొనసాగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.