Jaishankar: భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో పరువు తీయించుకోవడం యూరప్ జర్నలిస్టులు, యూరప్ నేతలకు అలవాటుగా మారింది. గెలికి మరీ తన్నించుకోవడం అంటే వారికి సరదాగా ఉంటుంది కావచ్చు. భారత్ ఒకప్పటి భారత్ కాదని ఇంకా యూరప్ దేశాలు, నాయకులు గుర్తించలేకపోతున్నారు. టాప్-5లో ఒక ఆర్థిక వ్యవస్థ అని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అని గుర్తించలేకపోతున్నారు. తమ పైత్యాన్ని జైశంకర్ ముందు చూపించాలని ప్రయత్నించి మరోసారి భంగపడ్డారు.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని ప్రశ్నించిన యూరప్ దేశాలకు గట్టి సమాధానం ఇచ్చారు. ఈ ప్రశ్న అడిగే నైతిక హక్కు యూరప్ దేశాలకు లేదని స్పష్టం చేశారు. యూరప్లో తయారైన ఆయుధాలను భారత్పై దాడులకు ఉపయోగించారని, కానీ భారత్ ఆయుధాలు ఎప్పుడూ యూరప్ లోని ఏ దేశానికి ముప్పుగా మారలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఫిన్లాండ్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న జైశంకర్ ‘‘ ఎమర్జింగ్ పవర్స్ అండ్ ది జియోపాలిటికల్ కాంపిటీషన్’’ అనే అంశంపై మాట్లాడారు.
ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా ముడి చమురును కొనుగోలు చేయాలన్న భారతదేశ నిర్ణయం, దాని అందుబాటు ధర, లభ్యతపై ఆధారపడి ఉందని అన్నారు. ప్రపంచ మార్కెట్లను స్థిరీకరించడంలో సహాయపడటానికి, 2022లో కొనుగోళ్లను కొనసాగించమని అమెరికానే భారతదేశాన్ని ప్రోత్సహించిందని ఆయన తెలిపారు. రష్యా పట్ల భారత్కు మితిమీరిన సానుభూతితో ఎందుకు ఉందని ఒక విలేకరి ప్రశ్నించడంతో జైశంకర్ ఇలా ఘాటుగా బదులిచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత దేశ సంప్రదాయ సరఫరాదారులైన మిడిల్ ఈస్ట్ నుంచి యూరప్ చమురు కొనుగోలు ప్రారంభించడంతో, భారత్ రష్యా చమురు వైపు మొగ్గు చూపిందని పేర్కొన్నారు. ఈ సమాధానంలో యూరప్ అహంకారంపై మరోసారి జైశంకర్ దెబ్బకొట్టారు.
యూరప్పై విమర్శలు చేస్తూ.. దశాబ్ధాలుగా యూరప్ తయారీ ఆయుధాలను భారత్కు వ్యతిరేకంగా ఉపయోగించారని, భారత్ మాత్రం ఎన్నడూ కూడా యూరప్ భద్రతకు ప్రమాదంగా మారలేదనే విషయాన్ని గుర్తుచేశారు. పాకిస్తాన్ సైన్యంలో ఉన్న జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్ వంటి యూరప్ దేశాల ఆయుధాలను, యుద్ధ విమానాలు, జలంతార్గాముల్ని జైశంకర్ పరోక్షంగా ఎత్తిచూపారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యన్ ఆయిల్ కొనుగోలును జైశంకర్ సమర్ధిస్తున్నారు.

