West Bengal: పశ్చిమ బెంగాల్లో బీజేపీ సర్కార్ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అవినీతిపై ఫోకస్ చేసింది. మమతా బెనర్జీ పాలన సమయంలో అక్రమాలకు పాల్పడిన వారికి పోలీసులు షాక్ ఇస్తున్నారు. అక్రమ వసూళ్లు, ఆక్రమణలపై సీఎం సువేందు అధికారి ఉక్కుపాదం మోపుతున్నారు. ఇదిలా ఉంటే, టీఎంసీ కార్యాలయంలో వందలాది ఆధార్ కార్డులు లభించడం ఇప్పుడు సంచలనంగా మారింది. కొల్కతా లోని సాల్ట్ లేక్ టీఎంసీ కార్యాయలం నుంచి ఈ ఆధార్ కార్డులతో పాటు కీలక డాక్యుమెంట్లను స్థానికులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో ఆధార్ కార్డులు బయటపడటంతో ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు.
టీఎంసీ కార్యాలయంలో లభించిన ఆధార్ కార్డులు తమవే అని స్థానికులు చెబుతున్నారు. ఆధార్ కార్డులు చేయించుకునే సమయంలో టీఎంసీ ఆఫీస్ అడ్రస్ ఇచ్చే వాళ్లమని వెల్లడించారు. ఆధార్ కార్డులు అడిగినప్పుడు టీఎంసీ కార్యకర్తలు ఇంకా రాలేదని చెబుతుండేవారని తెలిపారు. మే4వ తేదీన స్థానిక నివాసితులు పార్టీ కార్యాలయానికి తాళాలు వేశారు. తాజాగా ఆఫీస్ను ఓపెన్ చేసిన చూడగా ఆధార్ కార్డులు లభ్యమయ్యాయి. టీఎంసీ కార్యాలయంలో ఇంత పెద్ద సంఖ్యలో ఆధార్ కార్డులు బయటపడటం స్థానికంగా సంచలనంగా మారింది. ఇదే కాకుండా ప్రభుత్వ భూముల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి పత్రాలను కూడా బయటపడ్డాయి.
