Lightning: బీహార్ రాష్ట్రంలో భారీ వర్షాలు, పిడుగుపాటులు ప్రజలను వణికిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పిడుగుపాటు ఘటనల కారణంగా మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లోనే 25 మంది పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. మరణాల పట్ల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. వర్షం, పిడుగులు పడే సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆయన కోరారు.
Read Also: India-Russia Relations: ప్రధాని మోడీ రష్యా పర్యటనపై అమెరికా అసంతృప్తి..
మరణించిన 25 మందిలో, మధుబనిలో ఐదుగురు, ఔరంగాబాద్లో నలుగురు, సుపాల్లో ముగ్గురు, నలందలో ముగ్గురు, లఖిసరాయ్ మరియు పాట్నాలో ఇద్దరు చొప్పున, బెగుసరాయ్, జాముయి, గోపాల్గంజ్, రోహ్తాస్, సమస్తిపూర్, పూర్నియాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. బీహార్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం, ఒక్క జూలైలోనే పిడుగుపాటు కారణంగా 50 మంది మరణించారు. అయితే, అనధికార లెక్కల ప్రకారం మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
బీహార్లోని పలు జిల్లా్ల్లో గురువారం భారీ వర్షాలు, ఉరుములు-మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని, మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ కోరింది. శుక్రవారం పాట్నాతో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కిషన్గంజ్, అరారియా జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాటు వల్ల 17 మంది గాయాలపాలయ్యారు.