TFCC: తెలంగాణ ప్రభుత్వం సహకారంతో తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ‘టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023′ వేడుకలు దుబాయ్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు డా. ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ సందర్బంగా `టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023′ బ్రోచర్ ను సోమవారం ఫిలిం ఛాంబర్ లో ప్రముఖ రచయిత, ఎంపీ విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోనే `ఆర్ఆర్ఆర్’ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ ను ఘనంగా సన్మానించారు. టియస్ ఐఐసి ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు, ప్రసన్న కుమార్, కె. యల్. ఎన్. ప్రసాద్, శంకర్ గౌడ్, అశోక్ గౌడ్, వంశీ , శ్రీశైలం, నటి శుభశ్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ, “గత కొన్నేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డ్స్ ని మళ్లీ ప్రతాని రామకృష్ణ ప్రభుత్వ సహకారంతో ఇవ్వడం సంతోషకరం. అయితే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తీసే చిత్రాలకు స్పెషల్ గా నంది అవార్డ్ కేటాయిస్తే బావుంటుందన్నది నా ఆలోచన. అలాగే తెలంగాణ లో అద్భుతమైన టూరింగ్ స్పాట్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని 90 శాతం అక్కడే షూటింగ్ చేసే సినిమాలకు నంది అవార్డ్స్ తో పాటు నగదు ప్రోత్సాహకాలిస్తే మరిన్ని చిత్రాలు రూపొందడంతో పాటు తెలంగాణలో టూరిజం పెరిగే అవకాశం ఉంటుంది” అని అన్నారు.
టియస్ ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు మాట్లాడుతూ, “ప్రతాని రామకృష్ణ ఇస్తోన్న ఈ అవార్డ్స్ కి ప్రభుత్వం తరఫు నుంచి కచ్చితంగా మంచి సపోర్ట్ లభిస్తుంది. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటూ ఈ అవార్డ్స్ సక్సెస్ ఫుల్ గా జరిగేలా చూస్తాం. అలాగే తెలంగాణలో ప్రస్తుతం టూరిజం స్పార్ట్స్ పెరిగాయి. విజయేంద్రప్రసాద్ గారు చెప్పిన విషయాన్ని కచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం” అన్నారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, “టియఫ్ సీసీ నంది అవార్డ్స్ 2021, 22 సంవత్సరాలకు గానూ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులతో జ్యూరీ కమిటీని ఏర్పాటు చేసి అర్హులకు ఈ అవార్డ్స్ ఇవ్వనున్నాం. ఈ ఫంక్షన్ దుబాయ్ లో గ్రాండ్ గా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దుబాయ్ ప్రిన్స్ చేతుల మీదుగా అవార్డులు ఇస్తాం. ఆయన డేట్ తీసుకుని త్వరలో అవార్డ్స్ ప్రదానం ఎప్పుడు జరిగేదీ అధికారికంగా ప్రకటిస్తాం” అని చెప్పారు. తనకు జరిగిన సత్కారానికి కె.కె. సెంథిల్ సమాధానం చెబుతూ, “మనం చేసే పనికి గుర్తింపు వస్తే అదొక ఆనందం. ఆ గుర్తింపు, ప్రోత్సాహాన్నిఇచ్చేవి అవార్డ్స్ . అలాంటి ప్రతిష్టాత్మకమైన నంది అవార్డ్స్ ఆపివేయడం దురదృష్టకరం. మళ్లీ ప్రతాని గారు నంది అవార్డ్స్ స్టార్ట్ చేయడం సంతోషకరమైన విషయం” అని అన్నారు.