TFCC Helping Sun Shine OTT: మలేసియాలో ఎస్టాబ్లిష్ అయిన సన్ షైన్ ఓటీటీ ని ఇండియాలోని తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ప్రారంభించబోతున్నామని సీయండీ బొల్లు నాగ శివ ప్రసాద్ చౌదరి తెలిపారు. ఈ సంస్థ లోగోను సోమవారం ఎఫ్.ఎన్.సి.సి.లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ చౌదరి మాట్లాడుతూ, ”లాక్ డౌన్ టైమ్ లో ఓటీటీ సంస్థలు ప్రారంభమై పబ్లిక్ లోకి విపరీతంగా చొచ్చుకెళ్లాయి. దీనిపై నేను రెండేళ్ల పాటు రీసెర్చ్ చేసి సన్ షైన్ ఓటీటీ సంస్థను ప్రారంభించాను. ప్రస్తుతం ఇండియాలో టి.యఫ్.సి.సి. వారి సహకారంతో దీనిని ప్రారంభించబోతున్నాం. అన్ని భాషల చిత్రాలు మా ఓటీటీ ద్వారా రిలీజ్ చేయనున్నాం. ఇప్పటికే వెయ్యికి పైగా చిత్రాల బ్యాంక్ ఉంది. అలాగే ఒరిజినల్ కంటెంట్ కూడా ఉంది. న్యూ జనరేషన్ ని ఎంకరేజ్ చేయడానికి షార్ట్ ఫిలిం కాంటెస్ట్ కూడా పెట్టనున్నాం. ప్రతి ఏజ్ గ్రూప్ కి నచ్చే విధమైన కంటెంట్ మా ఓటీటీలో పొందుపరచాలని అన్నది మా లక్ష్యం. త్వరలో మా ఓటీటీ సంస్థని గ్రాండ్ గా లాంచ్ చేయనున్నాం” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, ”నిర్మాతకు తన సినిమాను ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి అమ్మాలనే విషయంలో స్వేచ్ఛ ఉండాలి. ఏ సంస్థో, ఏ అసోసియేషనో నిర్మాతపై ఒత్తిడి తేవడం కరెక్ట్ కాదు. డబ్బులు ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడే ఇచ్చుకునే అవకాశం నిర్మాతకు ఉండాలి. తెలుగు సినిమా రంగంలో కొందరు థియేటర్స్ ఇవ్వకుండా, ఓటీటీలో సినిమాలను అమ్ముకోకుండా అడ్డుకుంటున్నారు. ఇది ఎంత మాత్రం హర్షణీయం కాదు” అని అన్నారు. టీ.ఎఫ్.సి.సి. వైస్ ప్రెసిడెంట్ ఎ. గురురాజ్, నిర్మాత తరుణి రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.