Rudhrudu: యాక్టర్, కొరియోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్ రాఘవ లారెన్స్ కథానాయకుడిగా కతిరేశన్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రుద్రుడు’. ఈ సినిమా ఏప్రిల్ 14న పాన్ ఇండియా విడుదల కానుంది. దీన్ని తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ‘రుద్రుడు’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కతిరేశన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే… స్టార్ నిర్మాత ఠాగూర్ మధు పిక్సెల్ స్టూడియోస్ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను తాజాగా దక్కించుకుంది. చిత్ర నిర్మాణంతో పాటు పంపిణీ వ్యవహారాల్లోనూ అనుభవం ఉన్న ఠాగూర్ మధు ఈ సినిమాను విజయపథంలో నడిస్తారని నిర్మాతలు భావిస్తున్నారు. లారెన్స్ కు జోడిగా ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్నారు.