కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇటీవలే ‘బీస్ట్’ సినిమాతో పరాజయాన్ని చవిచూసిన విషయం విదితమే. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.ఇక దీంతో అభిమానులందరూ విజయ్ నెక్స్ట్ సినిమా పైనే అంచనాలు పెట్టుకున్నారు. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం విదితమే. ఇప్పటికే పూజా కార్యక్రమాలను కూడా జరుపుకున్నఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకొంటుంది. ఈ షూటింగ్ కోసం విజయ్ హైదరాబాద్ రావడం ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అస్సలు విషయం ఏంటంటే.. తమిళ్ హీరోలు తమ సినిమా షూటింగులను తమిళనాడులోనే జరపాలని, వేరే రాష్ట్రాల్లో జరపకూడదని, అలా జరిపితే తమిళ్ సినీ కార్మికులకు పనిలేకుండా పోతుందని ఏపీ మంత్రి రోజా భర్త ఆర్.కె సెల్వమణి గతంలోనే తెలిపారు. ఆయన ప్రస్తుతం ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న విషయం విదితమే.
ఇటీవలే స్టార్ హీరో అజిత్ ను కలిసిన సెల్వమణి ఇదే విషయాన్నీ ఆయనతో చర్చించారని, ఆయన మాటలను అజిత్ అంగీకరించి ఇతర రాష్ట్రాల్లో షూటింగ్ చేయనని తెలిపినట్లు సమాచారం. ఇక ఇప్పుడు విజయ్ తన షూటింగ్ ను హైదరాబాద్ లో చేయడం వలన ఆయన ఆర్.కె సెల్వమణి మాటలను ఖాతరు చేయడం లేదా అని కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. పోనీ వంశీ- విజయ్ చిత్రం ఏమైనా బై లింగువల్ సినిమానా అంటే అది కాదని, అది కేవలం తమిళ్ సినిమానే అని విజయ్ అధికారికంగా ప్రకటించాడు. మరి తమిళ్ సినిమా కోసం విజయ్ హైదరాబాద్ లో షూట్ చేయడం ఎందుకు..? సెల్వమణి ప్రకటన ఇచ్చిన తరువాత కూడా విజయ్ సినిమా హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావడంతో సెల్వమణి కి హీరో విజయ్ షాకిచ్చారా?అని వార్తలు గుప్పుమంటున్నాయి. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.