రవితేజ హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విక్రమార్కుడు’ సినిమా రవితేజ కెరీర్ లో మైలురాయిగా నిలిచింది. పోలీస్ పవర్ ను చాటిన సినిమాలలో ‘విక్రమార్కుడు’కి ప్రత్యేకమైన స్థానం ఉంది. రవితేజను ద్విపాత్రాభినయంలో అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రమిది. 2006 వచ్చిన ఈ సినిమాలో అనుష్క శెట్టి కథానాయిక. దీనిని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా ‘రౌడీ రాథోడ్’ పేరుతో రీమేక్ చేయగా అక్కడా జయకేతనం ఎగురువేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానున్నట్లు వినిపిస్తోంది. హీరోగా రవితేజ నటించటం ఖాయం అయినప్పటికీ దర్శకత్వం మాత్రం రాజమౌళి చేయబోవటం లేదు. ఎందుకంటే ముందుగా కమిట్ అయిన ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు రాజమౌళి. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ సీక్వెల్ కి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. ఈ సీక్వెల్కు సంపత్ నంది దర్శకత్వం వహిస్తాడని సమాచారం. ఇటీవల గోపీచంద్ తో ‘సీటీమార్’ తీసి హిట్ కొట్టి లైమ లైట్ లోకి వచ్చారు సంపత్ నంది. అంతే కాదు ఈ సారి ప్యాన్ ఇండియా స్థాయి సినిమాగా ఈ సీక్వెల్ తెరకెక్కబోతోందట. మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది? ఎవరు నిర్మిస్తారన్నది చూడాలి.