Taraka Ratna: తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఎస్ 5’! నో ఎగ్జిట్ అనేది ట్యాగ్ లైన్. భరత్ కోమలపాటి (సన్నీ కోమలపాటి) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆదూరి ప్రతాప్ రెడ్డి, దేవు శామ్యూల్, షైక్ రెహీమ్, మెల్కి రెడ్డి గాదె, గౌతమ్ కొండెపూడి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఇదే నెల 30న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు భరత్ కోమలపాటి మాట్లాడుతూ, ”కొన్ని నెలల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాం. ఫైనల్ గా మీ ముందుకొస్తున్నాం. ఈ చిత్రంలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్, టెక్నిషియన్ మాకు సహకరించారు. ట్రైన్ లో జరిగే కథ ఇది. సాయికుమార్ గారు, అలీ గారు నేను అడిగిన వెంటనే కీలక పాత్రల్లో నటించారు. నేను అనుకున్న కథను సినిమాటోగ్రాఫర్ ‘గరుడ వేగ’ అంజి అద్భుతంగా తెరకెక్కించారు. నా నిర్మాతలకు సినిమా ఇండస్ట్రీ గురించి తెలియదు. నా మీద నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు. సాయి కుమార్ గారు ఈ సినిమాలో చెప్పిన డైలాగ్స్ హైలైట్ అవుతాయి. ఈ చిత్రం చూసి మీరు ఇచ్చే ఫీడ్ బ్యాక్ తో మరింత వర్క్ నేర్చుకుంటా” అని అన్నారు.
సాయి కుమార్ మాట్లాడుతూ, ”ఈ సినిమా కథంతా ట్రైన్ లోనే జరుగుతుంది. అయితే నన్ను మాత్రం ట్రైన్ ఎక్కించలేదు. నేనే ఈ కథను ముందుకు తీసుకెళ్తాను. నా జీవితంలో ఎంతోమంది దిగ్గజ నటులతో కలిసి పనిచేశాను. కొత్త వాళ్ల సినిమా చేసినప్పుడూ అంతే సంతృప్తిగా ఉంటుంది. భరత్ ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంటాడు. ఇందులో పరిశ్రమలో పేరున్న నటీనటులను చాలా మందిని తీసుకున్నాడు. వాళ్లందరితో అతను వర్క్ చేయించిన విధానం నాకు నచ్చింది” అని అన్నారు. అలీ మాట్లాడుతూ, ”ఈ సినిమా సెట్ కు వెళ్లినప్పుడు నాకు బ్రేక్ ఇచ్చిన ‘ప్రేమ ఖైదీ’ సినిమా గుర్తొచ్చింది. పెద్ద పెద్ద దర్శకులు చేయాల్సిన సినిమా ఇది. కథ అంత బాగుంటుంది. నాకు ఓ మంచి క్యారెక్టర్ ఇచ్చాడు భరత్. అతని తర్వాత క్రెడిట్ సినిమాటోగ్రాఫర్ అంజికి ఇవ్వాలి” అని అన్నారు. ‘బిగ్ బాస్’ ఫేమ్ సన్నీ మాట్లాడుతూ, ”భరత్ నాకు మంచి ఫ్రెండ్. అతను డ్యాన్సర్ గా ఫేమస్. ఇప్పుడు దర్శకుడిగా కొత్త స్టెప్ వేశాడు. ఇందులోనూ సక్సెస్ అవ్వాలి” అన్నాడు. ‘ఇది హారర్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న సినిమానే అయినా కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుందని, ఈ నెల 30న దాదాపు 220 థియేటర్లలో దీనిని రిలీజ్ చేస్తున్నామ’ని నిర్మాతలు తెలిపారు. మెహబూబ్ దిల్ సే, సురేష్ వర్మ, ఫిష్ వెంకట్, రఘు, రితుజా సావంత్, అవంతిక హరి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించడం విశేషం.