ప్రముఖ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ ఈనెల 25న ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోలుగా నటించిన ఈ మూవీని భారీ బడ్జెట్తో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెరిగాయి. ఈ నేపథ్యంలో రేపటి నుంచి పలు ప్రాంతాల్లో పర్యటించేందుకు ఆర్.ఆర్.ఆర్ చిత్ర బృందం సిద్ధమైంది.
ఈ మేరకు మూవీ యూనిట్ షెడ్యూల్ విడుదల చేసింది. రేపటి నుంచి 23వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో హీరోలు ఎన్టీఆర్, రామ్చరణ్, దర్శకుడు రాజమౌళి పర్యటించనున్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీళ్లు దుబాయ్కు పయనం కానున్నారు. అటు ఈ నెల 19న బెంగళూరులో మూవీ యూనిట్ పర్యటించనుంది. అదేరోజు చిక్బల్లాపూర్లో నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిత్ర బృందం పాల్గొననుంది. మార్చి 20న బరోడా, ఢిల్లీలో ఎన్టీఆర్, రామ్చరణ్, రాజమౌళి పర్యటించనున్నారు. మార్చి 21న పంజాబ్లోని అమృత్సర్, రాజస్థాన్లోని జైపూర్లో మూవీ యూనిట్ ప్రచారం నిర్వహించనుంది. మార్చి 22న కోల్కతా, వారణాసిలో పర్యటించనుంది. మార్చి 23న తిరిగి మూవీ యూనిట్ హైదరాబాద్ చేరుకోనుంది.