Kanyakumari: ఆనంద్ దేవరకొండ ‘పుష్పక విమానం’ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు దామోదర. మొదటి సినిమాతోనే చక్కని గుర్తింపు తెచ్చుకున్న దామోదర ఇప్పుడు రెండో సినిమాకు శ్రీకారం చుట్టాడు. ‘పుష్పక విమానం’ వంటి మినిమం బడ్జెట్ మూవీతోనే మాగ్జిమం ఎంటర్టైన్ చేసిన దామోదర ఇప్పుడు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నాడు. దామోదర స్వీయదర్శకత్వంలో ర్యాడికల్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి ‘కన్యాకుమారి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ చాలామందికి నోస్టాల్జిక్ ఫీలింగ్స్ ను ఇస్తోంది. ‘పుష్పక విమానం’లో ఓ హీరోయిన్ గా నటించిన గీతా శైనీ, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటిస్తోన్న చిత్రం ఇది. మొదటి చిత్రాన్ని తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో చూపించిన దామోదర, రెండో దానిని శ్రీకాకుళం నేపథ్యంలో గ్రామీణ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ఎడిటర్: నరేష్ అడుపా, సంగీతం: సాహిత్య సాగర్, సినిమాటోగ్రఫీ : శివ గాజుల, సహ నిర్మాతలు : సతీష్ రెడ్డి, వరీనియా మామిడి, సిద్ధార్థ్ ఏ.