కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. కంఠీరవ స్టేడియంలో 36 గంటలకు పైగా పునీత్ భౌతికకాయం సందర్శన కొనసాగింది. ఈరోజు తెల్లవారుజాము వరకు భారీ సంఖ్యలో అభిమానుల తాకిడి ఉంది. రికార్డు స్థాయిలో 10 లక్షల మంది చివరి చూపు కోసం కంఠీరవ స్టేడియంకు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. పునీత్ ను అడ్మిట్ చేసిన విక్రమ్ ఆసుపత్రి నుంచి ఖననం వరకు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై.
Read Also : మా ఇద్దరివీ విభిన్నదారులు… పవన్ తో సినిమాపై రాజమౌళి కామెంట్స్
కంఠీరవ స్టేడియం నుంచి రాజ్ కుమార్ స్టూడియో వరకు నిరాడంబరంగా అంతిమ యాత్ర కొనసాగింది. ఆ తరువాత సంప్రదాయ రీతిలో అంతిమ సంస్కారాలు జరిగాయి. కుటుంబీకులు, ముఖ్య నటులు, ప్రభుత్వ పెద్దల మధ్య పునీత్ ఖననం ప్రభుత్వ లాంఛనాలతో జరిగింది. తెల్లవారుజామున 5 నుంచి 8.00 మధ్యలో పునీత్ అంతిమయాత్ర, ఖననం పూర్తయ్యాయి. స్టూడియో వెలుపల ఇప్పటికీ వేలాది మంది అభిమానులు ఉన్నారు. తన అభిమాన నటుడికి కడసారి కన్నీటి వీడ్కోలు పలికిన లక్షలాది మంది అభిమానులు ఇంకా ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారన్న విషయాన్నీ జీర్ణించుకోలేకపోతున్నారు.