తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న నటుడు నందమూరి తారక రామారావు. తెలుగు భాషపై, తెలుగు నేలపై ఆయన ముద్ర అజరామరం. సినిమా రంగంతోపాటు, రాజకీయ రంగంలోనూ కోట్లాది మంది మనసులో నిలిచిపోయిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు. ఈ ఏడాది మే 28 నుంచి ఆయన శత జయంతి వేడుకలు ఆరంభం అయ్యాయి. అందులో భాగంగా తెనాలిలో నందమూరి బాలకృష్ణ సారధ్యంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన ఎన్టీఆర్ శతాబ్ది చలన చిత్ర అవార్డు ప్రముఖ సినీ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత సి. అశ్వనీ దత్ కి ఎన్టీఆర్ మనువడు, హీరో నందమూరి తారక రత్న చేతుల మీదుగా అందజేశారు.
ఎన్టీఆర్ తో పలు సినిమాలను తీయటమే కాకుండా ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు అశ్వనీదత్. 2022 మే 28 న మొదలైన ఈ శత జయంతి వేడుకలు 2023 మే 28 వరకు 365 రోజుల పాటు జరగనున్నాయి. వారానికి 5 సినిమాలు, 2 సదస్సులు, నెలకు రెండు పురస్కార ప్రదానోత్సవాలతో ఈ వేడుకలను ఘనంగా జరుపుతుండటం విశేషం.