మహేశ్ బాబు, పరశురామ్ కాంబోలో రూపొందిన ‘సర్కారు వారి పాట’ మే 12వ తేదీన విడుదల అయ్యేందుకు ముస్తాబవుతోన్న విషయం తెలిసిందే! ఈ సందర్భంగానే చిత్రబృందం హైదరాబాద్లోని యూసుఫ్గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్కి పలువురు దర్శకులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మహేశ్కి అత్యంత సన్నిహితుడైన మెహర్ రమేశ్ కూడా వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మహేశ్ని ద బెస్ట్ వేలో పూరీ జగన్నాథ్ ‘పోకిరి’ సినిమాలో చూపించాడని, ఇప్పుడు అదే విధంగా పరశురామ్ ఈ సినిమాని తెరకెక్కించాడని మెహర్ చెప్పాడు. పూరీకి పరశురామ్ కజిన్ అవుతాడని, తొలుత తాను పూరీ వద్ద పని చేశానని, ఆ తర్వాత పరశురామ్ పూరీ దగ్గర పని చేశాడన్నాడు. మహేశ్ని ఎలా ప్రెజెంట్ చేయాలో.. అలాగే ఈ సినిమాలో చూపించాడని, చాలా క్లారిటీతో ‘సర్కారు వారి పాట’ తెరకెక్కించాడన్నాడు. ఎంత ఎంటర్టైన్ చేయాలో, అంత బాగా చేశాడన్నాడు. పాటలు, ఫైట్స్ (ట్రైలర్లో) ఎంతో బాగున్నాయని.. మీతో (ప్రేక్షకుల్ని ఉద్దేశించి) పాటు మేము కూడా అవి చూశామని, ఈ సినిమా కచ్ఛితంగా బ్లాక్బస్టర్ అవుతుందని నమ్మకం వెలిబుచ్చాడు.
సావిత్రి పాత్ర పోషించి, మహానటిగా ఎదిగిన జాతీయ పురస్కార గ్రహీత కీర్తి సురేశ్లో పరశురామ్ ఓ అల్లరి అమ్మాయిని చూశాడని, ఇందులో ఆమె చాలా మాసీగా కనిపిస్తోందన్నాడు. తన సినిమాలో (భోళాశంకర్) సిస్టర్ పాత్రలో చేస్తోన్న కీర్తి, దానికి పూర్తి విరుద్ధంగా ఈ సినిమాలో నటించిందన్నాడు. ఇక మహేశ్ బాబు గ్లామర్ & గ్రేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఇందులో మరింత అదరగొట్టాడని కొనియాడాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించడం పక్కా అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు.