కర్ణాటకలో మొదలైన హిజాబ్ వ్యవహారం నిదానంగా దేశ వ్యాప్తంగా విస్తరించబోతోంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందు చూపుతో నిరసనకారులను కట్టడి చేస్తుంటే, మరికొన్ని రాష్ట్రాలలో ఆ వివాదాలను అడ్డం పెట్టుకుని తమ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ వివాదం ఇంకా సద్దుమణగక ముందే ఇవాళ విడుదలైన విష్ణు విశాల్ ‘ఎఫ్.ఐ.ఆర్.’ మూవీతో మరో వివాదానికి తెర లేపినట్టు అయ్యింది. ఇందులో హీరో ముస్లిం, అలానే ప్రతినాయకుడు ముస్లిం టెర్రరిస్ట్. దేశంలో అరాచకం సృష్టించడం కోసం టెర్రరిస్టు ప్రయత్నం చేస్తుంటాడు, హీరోలో అతని పోలికలు ఉండటంతో అధికారులు అతన్ని అరెస్ట్ చేసి ఇంటాగేషన్ చేస్తారు… ఆ తర్వాత కథ రకరకాల మలుపులు తిరుగుతుంది. మొత్తం మీద దర్శకుడు ఓ వ్యక్తిని మతం ఆధారంగా అనుమానించకూడదని, ఈ దేశంలోని ముస్లింలు కూడా దేశభక్తులే అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇలాంటి కథాంశాలతో ఇప్పటికి ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ కథలోని హీరో, విలన్ ముస్లిం మతానికి చెందిన వ్యక్తులు కావడంతో కొందరు రాజకీయ నేతలు అందులోని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఎం.ఐ.ఎం. పార్టీ యాకత్ పురా శాసన సభ్యుడు, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ సయ్యద్ అహ్మద్ పాషా ఖద్రీ సైతం ఈ విషయమై తమ అభ్యంతరాలను తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు లేఖ ద్వారా తెలియచేశారు. ‘ఎఫ్.ఐ.ఆర్.’మూవీ పోస్టర్ పై అరబిక్ భాషలో ఉన్న ‘షహద’ అనే పదం ఇస్లాం మతానికి చెందిందని, అది ఇస్లాం మతానికి సంబంధించిన కీలకమైన అంశమని దానిని పోస్టర్ పై ప్రచురించడం ద్వారా ముస్లింల మనోభావాలను దెబ్బ తీశారని ఆ లేఖలో పేర్కొన్నారు. అలానే తెలంగాణ సినిమా రెగ్యులేషన్ యాక్ట్ 1955 లోని సెక్షన్ 8 ప్రకారం ఇందులో ముస్లిం మతానికి సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని, సినిమాతో పాటు ప్రమోషనల్ వీడియోస్ నుండి వాటిని వెంటనే తీసివేయాలని కోరారు. వాటి ద్వారా సమాజంలో సామరస్యం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే చిత్ర యూనిట్ ఇప్పటికే సినిమా రూపకల్పన విషయంలో తమకు ఎలాంటి దురుద్దేశాలూ లేవని, దేశభక్తి పేరితంగానే ఈ చిత్రాన్ని తీశామని, అయినా ముస్లింలు ఒకవేళ తమ మనోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తే వారికి క్షమాపణలు చెబుతున్నామని ఓ ప్రకటన విడుదల చేసింది. మరి ప్రభుత్వం ఇప్పుడు ఎలా స్పందిస్తుందో చూడాలి.