హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన చిన్నారి ఘటనపై నటుడు మహేష్ బాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు చేపట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలనీ అధికారులను మహేష్ కోరారు. సమాజం ఎంతగా పడిపోయిందో ఈ ఘటన గుర్తుచేస్తుందన్నారు. ఆడపిల్లలు ఎప్పుడు సురక్షితంగా ఉంటారా? అనేది ఎల్లప్పుడూ ఒక ప్రశ్నగానే మిగిలిపోతుందని మహేష్ బాబు ఆవేదనగా ట్వీట్స్ చేశారు.
నటుడు మంచు మనోజ్ కూడా ఈరోజు చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సంధర్బంగా మంచు మనోజ్ ఎమోషనల్ అయ్యారు. చిన్నారికి జరిగింది క్రూరత్వమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మనందరం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని మంచు మనోజ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం, పోలీసులు దీనిని సీరియస్ గా తీసుకోవాలని మంచు మనోజ్ డిమాండ్ చేశారు.
ఇక ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతుండడంతో సిటీ పోలీసులు గతంలో ఎన్నడూలేని రీతిలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిందితుడి సీసీ ఫుటేజీ, ఫోటోలు బయటకు వచ్చినా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేకపోయారంటూ పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడు రాజుపై 10 లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు. నిందితుడు రాజుకు సంబంధించిన ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు భరోసా ఇచ్చారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఈ మేరకు ప్రకటన జారీ చేశారు.