ఆ అందాల మెరుపు తీగెను తెరపై చూసి ఎందరో కవితాకన్యకలను తమ మదిలో నాట్యం చేయించారు. ఆ నవ్వులోని తళుకు చూసి ఇంకెందరో కలల సామ్రాజ్యాలను విస్తరించుకున్నారు. తన అందంతో పలువురిని కవులుగా, కలల రాకుమారులుగా మార్చిన ఘనత నాటి మేటి అందాలతార మాధురీ దీక్షిత్ కే దక్కిందని చెప్పవచ్చు. ఆ తరం నాయికల్లో తనదైన అందాల అభినయంతో మాధురీ దీక్షిత్ సాగిన తీరును ఎవరూ మరచిపోలేరు. ‘మాధురీ దీక్షిత్’ అన్న పేరు గుర్తు చేసుకుంటే చాలు ఈ నాటికీ మదిలో మధురమైన బాధను అనుభవించేవారెందరో!
మాధురీ దీక్షిత్ 1967 మే 15న బొంబాయిలో జన్మించారు. మూడేళ్ళ ప్రాయంలోనే మాధురి నాట్యం చేయడం ఆరంభించింది. ఆమెలోని ప్రతిభను గమనించిన కన్నవారు ప్రోత్సహించారు. కథక్ లో శిక్షణ ఇప్పించారు. దాదాపు ఎనిమిదేళ్ళు కథక్ నాట్యం అభ్యసించిన మాధురీ దీక్షిత్ తన నాట్యంతో ఇట్టే జనాన్ని కట్టిపడేసేవారు. చదువుకొనే రోజుల్లోనే మాధురీ దీక్షిత్ ఆటపాటల్లోనూ తనదైన బాణీ పలికించారు. స్కూల్ డే, కాలేజ్ డే ఎక్కడైనా మాధురీ నృత్యం ఉండాల్సిందే. మైక్రోబయాలజీలో బియస్సీ చేస్తూ ఉండగానే చదువుకు స్వస్తి పలికి, చిత్రసీమవైపు అడుగులు వేశారామె. హిరేన్ నాగ్ రూపొందించిన ‘అబోధ్’లో హీరోయిన్ గా పరిచయం అయ్యారు మాధురి. తరువాత “ఉత్తర్ దక్షిణ్, మోహ్రే’ చిత్రాల్లో నటించారామె. అయితే అనిల్ కపూర్ తో యన్.చంద్ర తెరకెక్కించిన ‘తేజాబ్’ ఆమెను రాత్రికి రాత్రి సూపర్ హీరోయిన్ గా నిలిపిందని చెప్పవచ్చు. ఇందులో “ఏక్ దో తీన్…” పాటలో మాధురీ దీక్షిత్ నృత్యం కుర్రకారును కిర్రెక్కించింది. యువకులకు నిద్ర లేకుండా గిలిగింతలు పెట్టింది. ఆ పై అనిల్ కపూర్ తో మాధురి నటించిన “రామ్ లఖన్, పరిందా, బేటా” వంటి చిత్రాలు ఉర్రూత లూగించాయి. ఆమిర్ ఖాన్ తో నటించిన ‘దిల్’, సంజయ్ దత్ తో మురిపించిన ‘సాజన్’,’ఖల్ నాయక్’, సల్మాన్ ఖాన్ తో అభినయించిన ‘హమ్ ఆప్ కే కౌన్’, షారుఖ్ ఖాన్ తో అలరించిన ‘దిల్ తో పాగల్ హై’ వంటి సినిమాలు విశేషాదరణ చూరగొన్నాయి. ఈ చిత్రాలన్నీ వసూళ్ళ వర్షం కురిపించాయి.
మాధురీ దీక్షిత్ అడుగు పెట్టే నాటికి శ్రీదేవి, మీనాక్షి శేషాద్రి తమదైన నృత్యంతో అలరిస్తూ ఉన్నారు. ఆ సమయంలో మాధురీ దీక్షిత్ అడుగు పెట్టి, తానూ నాట్యంతో పరవశింప చేయగలనని నిరూపించుకున్నారు. సరోజ్ ఖాన్ నృత్య దర్శకత్వంలో మాధురీ దీక్షిత్ నర్తించిన గీతాలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. ఆ తరువాతి రోజుల్లోనూ మాధురీ దీక్షిత్ తనదైన అభినయంతో సాగారు. తదనంతర తరం నాయికలతోనూ నర్తించి అలరించారు. అందుకు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘దేవ్ దాస్’ నిదర్శనమని చెప్పవచ్చు. ప్రఖ్యాత చిత్రకారుడు ఎమ్.ఎఫ్.హుసేన్ తనకంటే వయసులో ఎంతో చిన్నదైన మాధురి అందం చూసి బందీ అయిపోయారు. మాధురితో ఆయన ‘గజగామిని’ అనే చిత్రాన్నీ స్వీయ దర్శకత్వంలో రూపొందించి, ఆమె అందానికే ఓ నివాళిగా అందించడం విశేషం! బిగ్ స్క్రీన్ పై చివరగా ‘కళంక్’లో కనిపించిన ఈ కలల రాణి, ఈ మధ్య వెబ్ సీరిస్ ‘ద ఫేమ్ గేమ్’లోనూ నటించారు. పెళ్ళయి పిల్లల తల్లి అయినా, ఇప్పటికీ మాధురీ దీక్షిత్ లోని ఆకర్షణ ఏ మాత్రం తగ్గలేదని అభిమానులు భావిస్తూనే ఉంటారు. భవిష్యత్ లోనూ మాధురీ అందాల అభినయం ఆమె ఆరాధకులను ఆకట్టుకుంటుందనే చెప్పవచ్చు.