టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ఇటీవలే డీజే టిల్లు చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. చిన్న చిన్న పత్రాలు చేస్తూ హీరోగా మారిన సిద్ధు ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగాడు. ఈ చిత్రం తరువాత ఈ హీరో మంచి అవకాశాలనే అందుకుంటున్నాడు . అయితే హీరోగా ఒక్క హిట్టు పడేసరికి సిద్ధు బలుపు చూపిస్తున్నాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అయితే ఆలా అనుకోవడానికి కూడా కారణం లేకపోలేదని పలువురు నొక్కి వక్కాణిస్తున్నారు. డీజే టిల్లు రిలీజ్ కాకముందే సిద్దు ఒక సినిమాలో కీలక పాత్రలో చేస్తునట్లు ప్రకటించారు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘కప్పెలా’ రీమేక్ లో సిద్దు నటిస్తున్నాడని వార్తలు కూడా వచ్చిన విషయం విదితమే. డీజే టిల్లు సినిమా నిర్మించిన అదే బ్యానర్లో ఈ సినిమా కూడా తెరకెక్కుతుంది.
శౌరి చంద్రశేఖర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో హీరోయిన్ ను కాపాడే హీరో పాత్రలో సిద్దును ఎంపిక చేశారు మేకర్స్. ఈ పాత్ర కొద్దిసేపే ఉన్నా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మొదట ఈ పాత్రను ఒప్పుకొని డేట్స్ ఇచ్చి.. అగ్రిమెంట్ మీద కూడా సైన్ చేసిన సిద్దు.. డీజే టిల్లు హిట్ కావడం, ఓవర్ నైట్ స్టార్ గా మారడంతో.. ఈ సినిమాను పక్కన పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే స్టార్ గా మారుతున్న క్రమంలో మళ్లీ ఇలాంటి పాత్రలు చేస్తే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని సిద్దు భయపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతోనే ఈ సినిమా నుంచి తప్పుకున్నాడట. అయితే దర్శకుడు మాత్రం షూటింగ్ కూడా మొదలుపెట్టేశామని, అగ్రిమెంట్ మీద కూడా సైన్ చేసి ఎలా తప్పుకుంటాడని నిలదీయడంతో కంట్రోల్ తప్పిన సిద్దు అతడిపై కొద్దిగా దురుసుగా ప్రవర్తించినట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ విషయం తెలియడంతో ఇండస్ట్రీలో పలువురు ఒక్క హిట్టు పడడంతోనే బాబు బలుపు చూపిస్తున్నాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.