టాలీవుడ్ నటుడు జగపతి బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన 60 వ పుట్టినరోజు సందర్భంగా అవయవదానం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శుక్రవారం సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో జరిగిన అవయవదాన అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా గా హాజరైన ఆయన.. తన 60 వ పుట్టినరోజు సందర్భంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ..” మనిషిగా పుడతాం.. మనిషిగా పోతాం.. వెళ్ళేటప్పుడు ఎవ్వరు ఏమి తీసుకెళ్లారు.. ఒక్క 200 గ్రాముల బూడిద తప్ప ఏమి మిగలదు. దానికోసం ఈ జీవితం మొత్తం పరిగెడుతూనే ఉంటాం. ఈ అవయవ దానం ద్వారా మనం చనిపోయినా మరో 7, 8 మందికి పునర్జన్మ ఇవ్వవచ్చు.
నేను సినిమాలో హీరో అయినా, విలన్ అయినా నిజజీవితంలో హీరోలాగే బతకాలనుకుంటున్నాను. హీరోలాగే నా అవయవాలను దానం చేస్తున్నాను. కళారంగంలో సేవ చేసిన వారికి పద్మశ్రీ, పద్మ భూషణ్ లను ఇచ్చి సత్కరించినట్లు అవయవదానం చేసిన వారికి కూడా పద్మశ్రీ ఇవ్వాలి” అంటూ జగపతి బాబు తెలిపారు. ఇక ఈ నిర్ణయం విన్న జగ్గు బాయ్ అభిమానులు నిజంగా హీరో అనిపించుకున్నావ్ జగ్గు భాయ్ అంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు.ఇకపోతే ప్రస్తుతం జగపతి బాబు టాలీవుడ్, బాలీవుడ్ అని లేకుండా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.