ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ తమిళ చిత్రం ‘మానాడు’ తెలుగు డబ్బింగ్ తో పాటు అన్ని భాషల రీమేక్ రైట్స్ తీసుకున్న నేపథ్యంలో అందులో హీరోగా నటించేది ఎవరనే దానిపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ బాబు ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ కాకుండా రీమేక్ చేయబోతున్నట్టు, తమ నిర్మాణ భాగస్వామిగా ఏషియన్ ఫిలిమ్స్ వ్యవహరిస్తుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే.. ఈ రీమేక్ కు సంబంధించిన మిగిలిన వివరాలేవీ ఆయన ఇంతవరకూ ప్రకటించలేదు.
శింబు హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమా 2021లో తమిళనాట మంచి విజయాన్ని అందుకుంది. ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీలో విలన్ గా ఎస్. జె. సూర్య చక్కటి నటన కనబరిచాడు. కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్ గా మెప్పించింది. ఇది శింబు కు రైట్ కమ్ బ్యాక్ మూవీ అని చూసి వాళ్ళంతా కితాబిచ్చారు. అయితే దీనిని తెలుగులో రానా హీరోగా సురేశ్ బాబు తెరకెక్కించబోతున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం దీనిని తన రెండో కొడుకు అభిరామ్ తో రీమేక్ చేయడానికి సురేశ్ బాబు హక్కులు తీసుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే తేజ దర్శకత్వంలో అభిరామ్ ఓ సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత అతనితోనే ‘మానాడు’ను సురేశ్ బాబు రీమేక్ చేస్తాడట. అతి త్వరలోనే దర్శకుడితో పాటు ఇతర ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసి, అధికారిక సమాచారం ఇస్తారని తెలుస్తోంది. అదే నిజమైతే… అభిరామ్ ఖాతాలో కెరీర్ ప్రారంభంలోనే ఓ డిఫరెంట్ మూవీ పడినట్టే!