తమిళనాడు రాజకీయాల్లో సినిమా సెగలు ఎప్పుడూ ఎక్కువే, తాజాగా ‘ధురంధర్ 2’ అనే సినిమా ఇప్పుడు న్యాయ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తమిళనాడులో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ‘ధురంధర్ 2’ సినిమాలో అభ్యంతరకర రాజకీయ అంశాలు ఉన్నాయని ఒక అడ్వకేట్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా ఓటర్ల తీర్పును ప్రభావితం చేసేలా ఉందని, అందుకే ఈ సినిమాను తక్షణమే నిషేధించాలని ఆయన తన అత్యవసర పిటిషన్లో పేర్కొన్నారు.
Also Read:Koratala Siva: అయ్యో ‘దేవర’.. టాప్ డైరెక్టర్కు దొరకని హీరోలు.. నిజమేనా?
సినిమాలో ఉన్న కొన్ని సన్నివేశాలు, డైలాగులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయని పిటిషనర్ వాదించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇలాంటి సినిమాల ప్రదర్శన వల్ల రాజకీయంగా ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ సినిమా విడుదలను లేదా ప్రదర్శనను నిలిపివేయడమే ఉత్తమమని కోర్టుకు విన్నవించారు. సాధారణంగా ఎన్నికల సమయంలో రాజకీయ నేపథ్యంలో వచ్చే సినిమాలపై సెన్సార్ బోర్డుతో పాటు న్యాయస్థానాలు కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తుంటాయి. అయితే, ‘ధురంధర్ 2’ చిత్ర యూనిట్ మాత్రం ఇది కేవలం కల్పిత కథ అని, ఎవరినీ ఉద్దేశించి తీసినది కాదని వాదిస్తోంది. మద్రాస్ హైకోర్టు ఈ పిటిషన్ను విచారణకు స్వీకరిస్తుందా? లేదా సెన్సార్ బోర్డు నిర్ణయానికే వదిలేస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కోర్టు గనుక సినిమాపై స్టే విధిస్తే, అది నిర్మాతలకు పెద్ద దెబ్బే అని చెప్పాలి.