OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
- వివాదాస్పదంగా విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వ్యవహారం
- మంత్రి నారాయణకు వంశీకృష్ణ రాసిన సిఫారసు లేఖలపై చర్చ
- కోట్ల విలువైన జీవీఎంసీ స్థలాలను ప్రైవేట్కు ఇవ్వమంటూ లేఖలు
- ఈస్ట్ పాయింట్ కాలనీ బాబా ఆలయం దగ్గర 3వేల 660 చ.గజాల రెండు స్థలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ జనసేన ఎమ్మెల్యే ఏకంగా కూటమి ప్రభుత్వానికే షాకిచ్చారా? మంత్రికి సార్ రాసిన సిఫారసు లేఖలు చూసిన ప్రతి ఒక్కరికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోందా? పైరవీలకు కూడా ఒక పద్ధతీ… పాడూ…. ఉంటాయి కదా…? ఇవెక్కడి సిఫారసులుగా…బాబూ… అంటూ అంతా తల బాదుకుంటున్నారా? నవ్విపోదురుగాక… నాకేటి సిగ్గు అంటున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? ఎలాంటి సిఫారసు లేఖ, ఎవరికి రాశారు? వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్….విశాఖ దక్షిణం నియోజకవర్గం ఎమ్మెల్యే. సీనియర్ శాసనసభ్యులు చాలా మందే వున్న జిల్లాలో ఈ నేత దూకుడు మాత్రం ఇటీవల బహిరంగ చర్చకు కారణం అవుతోంది. సంథింగ్ స్పెషల్ అనిపించుకోవాలని బలంగా కోరుకుంటున్న వంశీ….అందరి కంటే రెండు ఆకులు ఎక్కువే చదివినట్టున్నారంటూ సొంత పార్టీ జనసేనలోనే గుసగుసలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఆయన లేఖల వ్యవహారానికి సంబంధించిన డిస్కషన్స్ హాట్ హాట్గా నడుస్తున్నాయి. మంత్రి నారాయణకు ఎమ్మెల్యే లేఖ రాయడం ఒక ఎత్తైతే…అందులో ప్రస్తావించిన అంశాలను చూసి సీనియర్ నేతలకు సైతం మతి పోతోందట. లెటర్స్ను జనసేనకే చెందిన మాజీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ బహిర్గతం చేయడం… పవన్ కళ్యాణ్ కల్పించుకోవాలని కోరడంతో అందరి అటెన్షన్ అటువైపు మళ్ళింది. సీనియర్ ఎమ్మెల్యేలు సైతం చేయని సాహసం….అదీ తన నియోజకవర్గానికి సంబంధం లేని వ్యవహారాల్లో వంశీ తలదూర్చడంపై కూటమి వర్గాలు రకరకాలుగా చర్చించుకుంటున్నాయి.
ఎమ్మెల్యే రాసిన సిఫార్సు లేఖలు చూసి ఏకంగా ఉన్నతాధికారులు సైతం కళ్ళు తేలేయడం ఇక్కడ ఇంకా పెద్ద ట్విస్ట్. ఎమ్మెల్యే సార్ కోరింది ఏ పోస్టింగో… ట్రాన్స్ఫరో కానే కాదు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధీనంలో వున్న కోట్ల రూపాయల విలువైన పార్క్ స్థలాలను బదలాయించాలని కోరి కలకలం రేపారాయన. స్వయంగా తన లెటర్ హెడ్ మీదే సిఫారసు లేఖ పంపడంతో మంత్రి పేషీ ఆఫీసర్స్ సైతం ముక్కున వేలేసుకున్నట్టు తెలిసింది. ఈస్ట్ పాయింట్ కాలనీలో సాయిబాబా ఆలయ కమిటీ రెండు పార్కులను దశాబ్దాలుగా ఉపయోగించుకుంటోంది. బాబా పూజకు అవసరమైన మొక్కలు పెంచడానికి ఒకటి, ప్రత్యేక పూజల సమయాల్లో పల్లకీని దింపడానికి మరొకదాన్ని వినియోగిస్తున్నారు. ఈ రెండు పార్కులు కలిపి 3వేల 660 చదరపు గజాల విస్తీర్ణం ఉంటుంది. ఇక్కడ గజం విలువ లక్షన్నరపైనే. ఆ లెక్కన కోట్ల విలువైన ఆస్తిని గతంలో ప్రైవేట్ వ్యక్తులు క్లెయిమ్ చేసుకోగా… కోర్టు కేసు వేసి మరీ దక్కించుకుంది జీవీఎంసీ. ఈ రెండు పార్కులు ప్రైవేటు పార్టీకి చెందినవని, వాళ్ళంతా తనకు పరిచయస్తులు గనుక పరిశీలించి అందుకు తగ్గట్టుగా జీవీఎంసీ, VMRDAలకు ఆదేశాలు జారీ చేయాలంటూ పురపాలక శాఖా మంత్రి నారాయణకు ఈ నెల 9న లేఖ రాశారు ఎమ్మెల్యే. లేదంటే నష్టపరిహారం ఇవ్వాలని కూడా సూచించారు. ఆ భూముల విలువ సుమారు 55 కోట్లు ఉంటుందని అంచనా కట్టారు.
Also Read
ఇక అక్కయ్యపాలెం 80 అడుగుల రహదారి సమీపంలోని భూమిని జీవీఎంసీ ఉపయోగించుకుంటోందని, దాన్ని కూడా వెనక్కి ఇవ్వాలని అదే మంత్రికి మరో లేఖ రాశారు వంశీకృష్ణ. ఈ భూమి మొత్తం దశాబ్దాలుగా జీవీఎంసీ వినియోగంలో ఉంది. అక్కడి ప్రజలకు నీటిని అందించేందుకు ఓవర్ హెడ్ ట్యాంక్, జీవీఎంసీ కార్యాలయం, పారిశుధ్య వాహనాల పార్కింగ్ కోసం వాడుకుంటోంది. ఈ భూమి కూడా తనకు అత్యంత ఆప్తులైన వారికి చెందింది కనుక తగిన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు. వాస్తవానికి ఈ రెండు భూములు న్యాయస్థానాల ద్వారా జీవీఎంసీకి దఖలు పడ్డాయి. ఇది జరిగి మూడు దశాబ్దాలు దాటింది. ఇప్పుడు వాటిని వెనక్కి ఇవ్వాలని, లేదంటే నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే లేఖ రాయడంపై వివిధ వర్గాల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. అది కూడా తన పరిధిలోకి రాని వ్యవహారాలు కావడం మరింత ఆశ్చర్యానికి కారణమవుతోంది. వాస్తవానికి వంశీ ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణ నియోజకవర్గంలో రాజకీయంగా ప్రతికూలతలు పెరుగుతున్నాయి.
ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వరకు YSR కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరుగా చెలామణి అయ్యారు వంశీ. తృటిలో గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం చేజారినా…స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించింది ఫ్యాన్ పార్టీ. అయితే, అనూహ్యంగా ఆయన పార్టీ మారడం, జనసేనలో ఆదరణ… ఎమ్మెల్యే అవడం ఇలా ఒకదాని వెనుక ఒకటిగా కలిసి వచ్చాయి. గెలిచింది మొదటిసారే అయినా సిటీలో బలమైన ఎమ్మెల్యేగా తన మార్క్ వేసుకునే ప్రయత్నంలో ఉన్నారాయన. తాను సుదీర్ఘకాలం పనిచేసిన వైసీపీని టార్గెట్ చేయడం, మొదటి నుంచి రాజకీయ ప్రత్యర్థులైన టీడీపీ నేతలతో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడం ద్వారా తాను కూటమి తాను ముక్కనేనని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా ఇక్కడి నుంచే సౌత్ టీడీపీ వెర్సెస్ ఎమ్మెల్యే ఫైట్ ముదిరి పాకాన పడింది. ఇక్కడ టీడీపీ ఇంచార్జ్ సీతం రాజు సుధాకర్., ఎమ్మెల్యే వంశీ ఎడ ముఖం పెడ ముఖం కావడంతో అటు టీడీపీ, ఇటు జనసేన వర్గాలు రగిలిపోతున్నాయి. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు ఎమ్మెల్యే దశాబ్దాల నాటి భూముల తుట్టెను కదిలించడం చర్చనీయాంశమైంది. ఎప్పుడో విశాఖ మున్సిపాలిటీకి దఖలుపడ్డ భూముల్ని తిరిగి ఇవ్వాలంటూ ఎమ్మెల్యే మంత్రికి లేఖలు రాశారంటే అది తెగింపుకాక ఇంకేంటనే వాళ్ళు సైతం ఉన్నారు. అంతలా తెగించారంటే… తెర వెనక ఏం జరిగి ఉంటుందోనని కామెంట్ చేసేవాళ్ళు సైతం పెరుగుతున్నారు.
- Tags
- janasena
- NTV Telugu
- OTR
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
-
OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!