తెలుగు ఇండియన్ ఐడిల్ 19, 20 ఎపిసోడ్స్ లో తన వ్యూవర్స్ కు డబుల్ థమాకా ఇస్తోంది. ఇప్పటికే బరిలో ఉన్న పది మంది కంటెస్టెంట్స్ తో గొంతు కలిపేందుకు ఐదుగురు స్టార్ ప్లేబ్యాక్ సింగర్స్ రంగంలోకి దిగారు. హేమచంద్ర, పృథ్వీచంద్ర, శ్రావణ భార్గవి, దామిని, మోహన భోగరాజు ఈ శుక్రవారం 5 మంది కంటెస్టెంట్స్ తో కలిసి అద్భుతంగా పాటలు పాడారు. పాపులర్ సింగర్స్ తో కంటెస్టెంట్స్ గొంతు కలపడం ఒక ఎత్తు అయితే, ఈ వారం ఎలిమినేషన్ ఉండటంతో న్యాయ నిర్ణేతలు తమన్, నిత్యామీనన్, కార్తీక్ చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరించారు.
తెలుగు ఇండియన్ ఐడిల్ ఎపిసోడ్ ప్రతిసారి హోస్ట్ శ్రీరామచంద్ర తవిక… సారీ కవితతో మొదలవుతుంది. అయితే ఈ సారి అతనికి బదులు శ్రీరామచంద్ర మీదనే హేమచంద్ర చదివిన కవితతో షురూ అయ్యింది. తర్వాత మారుతి వేదిక మీదకు వచ్చి, అందరినీ తన మేకోవర్ తో సర్ ప్రైజ్ చేశాడు. హెయిర్ స్టైల్ నుండీ అన్నీ మార్చేసిన మారుతిని నిత్యా మీనన్ గుర్తే పట్టలేదు. అతను స్టేజ్ మీద తన సిగ్నేచర్ స్టైల్ ను నిలుచున్న తర్వాత అతను మారుతినే అనే నిర్థారణకు వచ్చింది. కేవలం వేషం మార్చడమే కాదు… తన సింగింగ్ స్టైల్ ను మారుతి మార్చేశాడు. నాని నటించిన ‘ఎంసీఏ’ మూవీలోని పాటను మారుతి పాడాడు. సినిమాలో ఆ పాటను పాడిన శ్రావణ భార్గవినే ఇప్పుడు వేదిక మీద కూడా మారుతితో కలిసి పాడటం ఓ విశేషం. మారుతి పాటకు నిత్యా మీనన్, కార్తీక్ కన్వెన్స్ అయి మెచ్చుకున్న… అప్ టూ ద మార్క్ లేదంటూ తమన్ పెదవి విరిచేశాడు.
సెకండ్ కంటెస్టెంట్స్ శ్రీనివాస్ ధరిమిశెట్టి విషయంలోనూ అదే జరిగింది. ‘మిరపకాయ్’ మూవీలోని పాటను అతను దామినితో కలిసి పాడాడు. అయితే… న్యాయనిర్ణేతలు ఏదో జోష్ మిస్సయ్యిందని, శ్రీనివాస్ పూర్తిగా ఎందుకో ఓపెన్ కాలేకపోయాడని అభిప్రాయపడ్డారు. జస్ట్ ఓకే అనేశారు. ఆ తర్వాత లాలస, పృథ్వీరాజ్ తో కలిసి ‘ఏ మాయ చేసావే’ మూవీలోని ‘ప్రేమే వరమా’ సాంగ్ ను అద్భుతంగా పాడింది. ఆమె గాత్రానికి ఫిదా అయిపోయిన తమన్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చాడు. నిత్యా మీనన్, కార్తీక్ కూడా ఆమెను అభినందించారు. ఈ పాటను ఆమె పాడుతున్నంత సేపు ఎవరికి వారు తమ ప్రేమ వ్యవహారాలను తలుచుకున్నారు. ఈ పాటను సినిమాలో కార్తీక్ పాడటంతో అతనితో కలిసి పాడాలని ఉందని లాలస కోరడంతో కార్తీక్ ఆ కోరిక తీర్చేశాడు.
ఆ తర్వాత అదితి… హేమచంద్రతో కలిసి ‘బిల్లా’ సినిమాలోని ‘వేరీజ్ ద పార్టీ’ పాట పాడింది. ఇద్దరూ ఆ పాటకు ప్రాణం పోశారంటూ నిత్యా మీనన్ తెగ మెచ్చుకుంది. ఇక హేమచంద్ర గొంతులోని ఆ బేస్ కు తాను ఫిదా అయిపోయాయని అడిగి మరీ మళ్ళీ ఆ వాయిస్ ను విని ఆనందించింది. కార్తీక్ సైతం హేమచంద్ర గాత్రాన్ని తెగ మెచ్చుకున్నాడు. రీల్స్ చేయడాన్ని ఇష్టపడే అదితి తాజాగా తెలుగు ఇండియన్ ఐడిల్ కంటెస్టెంట్స్ తో కలిసి చేసిన రీల్స్ ను వ్యూవర్స్ కోసం ప్లే చేశారు. అవన్నీ చాలా ఫన్నీగా ఉండి ఆకట్టుకున్నాయి.
ఈ ఎపిసోడ్ లో చివరగా మాన్య ‘అఖండ’ సినిమాలోని అమ్మ పాటను పాడింది. సినిమాలో ఆ పాటను పాడిన మోహన భోగరాజు సైతం ఆమెతో జతకట్టింది. అయితే… మోహన గానం ముందు మాన్య తేలిపోయింది. ఆమె వంతు కృషి చేసినా… తేడా స్పష్టంగా కనిపించేసింది. అదే విషయాన్ని తమన్ చెప్పాడు. హైపిచ్ లో పాడేప్పుడు మైక్ ను ఎంత దూరంగా పట్టుకోవాలో హేమచంద్రను చూసి నేర్చుకోవాలని సలహా ఇచ్చాడు. మాన్య వాయిస్ కు ఈ పాట సూట్ కాలేదని నిత్యా తేల్చి చెప్పేసింది. అయితే ఆమె ప్రయత్నాన్ని కార్తీక్ అభినందించాడు. మొత్తం మీద ఈ ఎపిసోడ్ లో లాలస, అదితి పాడిన పాటలు మాత్రమే అందరినీ ఆకట్టుకున్నాయి. మిగిలిన వాళ్ళు పేలవమైన ప్రదర్శన ఇచ్చారన్నది స్పష్టమైపోయింది.