హీరోగా ఆశిష్కు ‘రౌడీబాయ్స్’ సినిమాతో శుభారంభం దక్కడం ఆనందంగా ఉందంటున్నారు నిర్మాత దిల్ రాజు. యాక్టింగ్ తో పాటు డ్యాన్స్ లో చక్కటి పరిణతి కనబరచిన ఆశిష్ ఎమోషన్, ఎంటర్టైన్మెంట్తో కూడా అందర్ని ఆకట్టుకున్నాడని చెబుతుంతే చాలా సంతోషంగా ఉంది అంటున్నారు దిల్రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి ఆయన నిర్మించిన తాజా చిత్రం రౌడీబాయ్స్. ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ ఇందులో జంటగా నటించారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. బుధవారం దిల్రాజు పాత్రికేయులతో ముచ్చటించారు.
ఓపెనింగ్స్ నిలకడగా ఉన్నాయని, పండుగ తర్వాత కూడా వసూళ్లు తగ్గలేదంటూ ఐదు రోజుల్లో దాదాపు ఏడు కోట్ల గ్రాస్, నాలుగున్నర కోట్ల షేర్ లభించిందన్నారు రాజు. కొత్త హీరో సినిమాకు ఈ స్థాయి ఆదరణ దక్కడం సంతోషంగా ఉందని, రెండో వారంలో ఇదే ఆదరణ లభిస్తుందనే నమ్మకాన్ని వెలిబుచ్చారు దిల్ రాజు. ఈ సినిమాను యాభై రోజుల తర్వాతే ఓటీటీలో విడుదలచేస్తాం. దేవిశ్రీప్రసాద్ పాటలకు చక్కటి స్పందన లభిస్తున్నది. త్వరలో మ్యూజికల్ కంటెస్ట్ నిర్వహించబోతున్నాం. ఆశిష్ హీరోగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్తో కలిసి సెల్ఫిష్ పేరుతో ఓ సినిమా నిర్మించబోతున్నాం. సుకుమార్ శిష్యుడు కాశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. సుకుమార్ సంభాషణలను అందించనున్నారు. ఆర్య తర్వాత నేను, సుకుమార్తో కలిసి చేస్తున్న చిత్రమిదని అన్నారు దిల్ రాజు.