యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. పలు చిత్రాలలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే అతను నటించిన రెండు సినిమాలు ఈ యేడాది జనం ముందుకు వచ్చాయి. ప్రస్తుతం నిర్మాత కె. కె.రాధామోహన్ ఆదిసాయికుమార్ హీరోగా ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ‘క్రేజీ ఫెలో’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా నిర్మాత రాధామోహన్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.
సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ‘క్రేజీ ఫెలో’గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా వుంది. ఆది చేతిలో గులాబీ పువ్వుల గుత్తితో నవ్వుతూ కనిపిస్తుండగా, హీరోయిన్లు దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్ సీతాకోకచిలుక రెక్కలుగా చెరో వైపు కనిపించడం ఎలిగెంట్ గా వుంది. ఆర్. ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటివరకు విడుదలైన పాటలన్నీ చక్కని ఆదరణ పొందాయని నిర్మాత రాధామోహన్ చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఆ మధ్య ఈ సినిమా కోసం శ్రీరామచంద్ర పాడిన పాటను ‘తెలుగు ఇండియన్ ఐడల్’ వేదికపై విడుదల చేశారు.