టాలీవుడ్లో టైటిల్ వివాదాలు కొత్త కాకపోయినా.. ఒక సామాన్య మహిళా నిర్మాతను, అదీ ఒక రైతును పాన్ ఇండియా సినిమా ‘స్పిరిట్’ లీగల్ నోటీసులు ఏ స్థాయిలో రోడ్డున పడేశాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. రెండూ వేర్వేరు కథలైనా.. కేవలం ‘స్పిరిట్’ అనే పేరు ఉండటం వల్లే తన 50 ఏళ్ల కల, ఆస్తులు ఎలా బుూడిదయ్యాయో చెప్తూ నిర్మాత నర్సమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. తన సినిమా విడుదలను ఆపిన ప్రభాస్ ప్రొడ్యూసర్స్, ఇప్పుడు తన సినిమాను ప్రభాస్ గారే స్వయంగా విడుదల చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహిళా నిర్మాత నర్సమ్మ చిన్నప్పటి నుంచి సినిమా తీయాలనే కలతో.. తనకున్న గొర్రెలు, మేకలు, ఆస్తులు అమ్ముకుని, అప్పులు చేసి ఎంతో కష్టపడి ‘స్పిరిట్ ఇస్ నాట్ వన్’ అనే సినిమాను నిర్మించారు. మే 29న గ్రాండ్గా విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని, సెన్సార్ పూర్తి చేసి, ప్రమోషన్లు కూడా పూర్తి చేశారు.
కానీ, సరిగ్గా రిలీజ్ సమయానికి ప్రభాస్ ‘స్పిరిట్’ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ (భూషణ్ కుమార్) నుండి లీగల్ నోటీసులు రావడంతో సినిమా విడుదల ఆగిపోయింది. దీనివల్ల ఊరిలో అప్పు ఇచ్చిన వాళ్లు, ఇవ్వాల్సిన వాళ్లు అందరూ నర్సమ్మను అవమానించడం మొదలుపెట్టారు. “డబ్బులు ఎగ్గొట్టడానికే ప్రభాస్ ప్రొడ్యూసర్స్ నోటీసులు పంపించారంటూ” ఊరిలో తన పరువు తీశారని, డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమాను విడుదల చేయమని చేతులెత్తేయడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయానని ఆమె వాపోయారు. “గత మూడేళ్లుగా మా ‘స్పిరిట్ ఇస్ నాట్ వన్’ సినిమా పేరు మీద ఎన్నో మీడియా ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇచ్చాం, ప్రమోషన్లు చేశాం. అప్పుడు స్పందించని పెద్ద నిర్మాణ సంస్థలు, సరిగ్గా సినిమా థియేటర్లలోకి వచ్చే టైమ్కే అభ్యంతరం చెప్పడం వెనుక ఉన్న కుట్ర ఏంటో తెలియాలి. మమ్మల్ని ముందే ప్రేమగా అడిగి ఉంటే.. ప్రభాస్ గారి కోసం ఆ టైటిల్ను మేము సంతోషంగా ఇచ్చేవాళ్లం. కానీ, మమ్మల్ని ఎవరూ సంప్రదించకుండా నేరుగా కోర్టు నోటీసులతో చిన్న నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నారు.” అని నిర్మాత నర్సమ్మ పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో తనకు ఎవరూ అప్పు ఇచ్చే పరిస్థితి లేదని, సినిమాను తాము సొంతంగా విడుదల చేసుకోలేమని నర్సమ్మ స్పష్టం చేశారు. తాము చేసిన తప్పు లేదని, అవసరమైతే న్యాయం కోసం కోర్టుకు వెళ్లి పోరాడతానని చెప్పారు. అయినా న్యాయం జరగకపోతే.. ప్రభాస్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు తాము కూడా కోర్టుకు వెళ్లి ఆ సినిమాను ఆపిస్తామని హెచ్చరించారు. అప్పటికీ కాకపోతే, ప్రభాస్ సినిమా ఆఫీస్ ముందే తన ఫ్యామిలీ అంతా ఏం చేసుకుంటుందో అప్పుడు తెలుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మా సినిమాను ఆపేసిన ప్రభాస్ గారే.. ఇప్పుడు మా సినిమాను విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలని, హీరో ప్రభాస్ మరియు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వెంటనే ఈ విషయంపై స్పందించి ఒక మహిళా రైతు నిర్మాతకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

