K RAMP చిత్ర నిర్మాత రాజేష్ దండ కొందరు తన సినిమాపై కావాలని నెగిటివ్ చేస్తున్నారని వారిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. రాజేష్ దండా చేసిన ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ‘నిర్మాతగా, పంపిణీ దారుగా రాజేష్ దండా మీడియాతో ఎలాంటి గౌరవ మర్యాదలతో వుంటాడు అన్నది మీడియా మిత్రులు అందరికీ తెలుసు. అలాంటి నేను నిన్న ఎందుకు ఓ వెబ్ సైట్ పట్ల, ఆ వెబ్ సైట్ నిర్వాహకుల పట్ల, పరుషంగా మాట్లాడాల్సి వచ్చింది. కోట్లు ఖర్చు పెట్టి నిర్మాతగా ఓ సినిమా తీసాను. ఓ వెబ్ సైట్ దానిని సమీక్షించి, దానికో రేటింగ్ ఇచ్చింది.
Also Read : Bollywood : 68 ఏళ్ల వయసులో కూడా అదరగొడుతున్న స్టార్ హీరో
అంత వరకు నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ సినిమాను జనం ఆదరిస్తున్నారు. ఆ విధంగా సినిమా హిట్ అయితే ఆ సైట్ సమీక్షల క్రెడిబులిటీ పోతుంది. అందుకే వాళ్ల రేటింగ్ ను నిలబెట్టుకోవాలని నా సినిమా మీద నెగిటివ్ పోస్ట్ లు, నెగిటివ్ వార్తలు వేయడం ప్రారంభించారు. గతంలో మ్యాడ్ 2 సినిమా విషయంలో ఇంకో వెబ్ సైట్ ఇలాగే చేస్తే, నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించారు. అప్పుడు కూడా ఆయన చెప్పారు. మా మీద ఆధారపడి వెబ్ సైట్ లు నడుపుతూ ఇలా చేయడం తప్పు అని చెప్పారు.
ఇప్పుడు నేనూ అదే చెబుతున్నాను. అయితే నేను వాడిన భాష అభ్యంతరకరం అని అంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసిన నా సినిమాను చంపేస్తూ, నాకు కోట్ల నష్టం కలిగించే ప్రయత్నం చేస్తుంటే కోపం రాదా.. నేనూ మనిషినే కదా. అందుకే అలా మాట్లాడాను. అంతకు మించి మరే మీడియా సంస్థ మీద, మరే మీడియా వ్యక్తి మీద నాకు ఏ కోపం లేదు. పైగా 150 మందికి పైగా వున్న సినిమా జర్నలిస్ట్ లు, సోషల్ మీడియా జనాలు, మీమర్స్ అందరూ నాకు అత్యంత సన్నిహితులే. వారంటే నాకు ఎప్పుడూ గౌరవం వుంటుంది. నా బాధ, కోపం లో వచ్చిన భాషను సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నా యుద్దం మీడియా మీద కాదు మీడియా ముసుగు లో సినిమా లను చంపుతున్నకొందరిపై మాత్రమే’ అని స్పష్టం చేశారు.