సంగీత జ్ఞాని ఇళయరాజాకు న్యాయస్థానంలో భారీ షాక్ తగిలింది. ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ‘సరిగమ ఇండియా లిమిటెడ్’ సంస్థతో నడుస్తున్న కాపీరైట్ వివాదంలో ఢిల్లీ హైకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇళయరాజాకు వ్యతిరేకంగా ఇచ్చిన మధ్యంతర స్టే (ఇంజంక్షన్ ఆర్డర్)ను ఎత్తివేయడానికి కోర్టు సెంటిమెంట్గా నిరాకరించింది. ఫలితంగా, ఆ 134 సినిమాల్లోని పాటలపై ఇళయరాజాకు ప్రస్తుతానికి ఎలాంటి హక్కులు ఉండవని స్పష్టమైంది.
అసలేమిటీ వివాదం?
ఈ వివాదం మొత్తం 134 సినిమాలలోని సౌండ్ రికార్డింగ్లు, లిరిక్స్, మ్యూజికల్ వర్క్స్కు సంబంధించింది. ఇందులో ఇళయరాజా క్లాసిక్స్ అయిన అన్నకిలి, 16 వయతినిలే, కవిక్కుయిల్, భారతి, పల్లవి అను పల్లవి, ముల్లుమ్ మలరుమ్, రాజా పార్వై, నెట్రికన్, కల్యాణరామన్ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాల మ్యూజిక్ రైట్స్, ఓనర్షిప్ తమదేనంటూ ‘సరిగమ’ సంస్థ కోర్టును ఆశ్రయించింది. తమకు తెలియకుండా ఇళయరాజా ఈ పాటలను వేరే ప్లాట్ఫారమ్లకు లైసెన్స్ ఇస్తున్నారని, యాజమాన్య హక్కులు క్లెయిమ్ చేస్తున్నారని ఆరోపించింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ తుషార్ రావు నేతృత్వంలోని సింగిల్ బెంచ్.. గత ఫిబ్రవరి 13న ఇళయరాజాపై ఎక్స్-పార్టీ మధ్యంతర స్టే విధించింది. ఈ ఆర్డర్ ప్రకారం సరిగమ కాపీరైట్ కలిగి ఉన్న పాటలను వాడటం, వేరొకరికి లైసెన్స్ ఇవ్వడం లేదా ఓనర్షిప్ క్లెయిమ్ చేయడం వంటివి ఇళయరాజా చేయకూడదు. ఈ స్టేను రద్దు చేయాలంటూ ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తాజాగా తిరస్కరించింది.
1901లో ‘ది గ్రామోఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్’ పేరుతో ప్రారంభమైన తమ సంస్థకు కొన్ని దశాబ్దాల చరిత్ర ఉందని సరిగమ కోర్టుకు తెలిపింది. 1976 నుంచి 2001 మధ్య కాలంలో ఆయా సినిమాల నిర్మాతలతో తాము కుదుర్చుకున్న అగ్రిమెంట్ల ప్రకారం.. ఆయా పాటల పూర్తి కాపీరైట్స్ (సౌండ్ రికార్డింగ్, సాహిత్యం, సంగీతం) తమకే చెందుతాయని స్పష్టం చేసింది. తమిళ్, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో తమకు భారీ మ్యూజిక్ క్యాటలాగ్ ఉందని పేర్కొంది. అయితే, ఇటీవల అమెజాన్ మ్యూజిక్, ఐట్యూన్స్, జియోసావన్ వంటి ప్లాట్ఫారమ్లలో తమ కాపీరైట్ కంటెంట్ను ఇళయరాజా క్లెయిమ్ చేస్తున్నట్లు గుర్తించామని, అంతకుముందు జనవరిలో ఆయన పంపిన లీగల్ నోటీసులో కూడా ఈ పాటలన్నీ తానే కంపోజ్ చేసి, ఆర్కెస్ట్రేషన్ చేసినందున హక్కులు తనవేనని వాదించారని సరిగమ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

