బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ, రికార్డులను తిరగరాస్తోంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం, కేవలం ఆరు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 919 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. ఇందులో ఇండియాలోనే రూ. 695 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు నమోదు చేయడం సినిమా దూకుడుకు నిదర్శనం. వీక్డేస్లో కూడా కలెక్షన్లు ఏ మాత్రం తగ్గడం లేదు. ఐదో రోజు రూ. 65 కోట్లు, ఆరవ రోజు రూ. 56 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్ మార్కెట్లో కూడా ‘ధురంధర్ 2’ దూసుకుపోతోంది. ఇప్పటికే రూ. 200 కోట్ల మార్క్ను దాటేసి, గ్లోబల్ స్థాయిలో భారీ వసూళ్లను అందుకుంటోంది.
Also Read: Ram Charan: పెద్ది షూటింగ్లో రామ్ చరణ్కు గాయం!
ఈ వేగాన్ని చూస్తుంటే, కేవలం వారం రోజుల్లోనే రూ. 1000 కోట్ల క్లబ్లో చేరడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే అత్యధిక వేగంగా వారం రోజుల్లోనే వెయ్యి కోట్లు రాబట్టిన చిత్రంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయనుంది ధురంధర్ 2. సుమారు నాలుగు గంటల భారీ రన్టైమ్ ఉన్నప్పటికీ, ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించడం విశేషం. మొదటి భాగం సుమారు రూ. 1400 కోట్ల వసూళ్లు సాధించిన నేపథ్యంలో, ‘ధురంధర్ 2’ రూ. 2000 కోట్ల మార్క్ను అందుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. బాలీవుడ్లో హిట్ సినిమాలకు లాంగ్ రన్ ఉండటం ఈ అంచనాలకు బలం ఇస్తోంది. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ తన పవర్ఫుల్ యాక్షన్తో ప్రేక్షకులను ఆకట్టుకోగా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో మెప్పించారు. మొత్తానికి ‘ధురంధర్ 2’ భారతీయ సినీ చరిత్రలో కొత్త రికార్డులను సృష్టించే దిశగా దూసుకెళ్తోంది.