మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘భోళా శంకర్’. ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ మెగాస్టార్కు చెల్లిగా నటిస్తున్నారు. అయితే.. ఈ సినిమాతో పాటు.. ‘గాడ్ ఫాదర్’ .. ‘వాల్తేర్ వీరయ్య’ చిత్రాలు కూడా చాలా తక్కువ గ్యాపులో చిరంజీవి పట్టాలపైకి తీసుకుని వచ్చారు. ‘గాడ్ ఫాదర్’ సినిమాను దాదాపు పూర్తి చేసిన ఆయన, ఆ తరువాత ప్రాజెక్టులపై పూర్తి దృష్టి సారించారు. ‘వేదాళం’ సినిమాకి రీమేక్ గా రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘భోళా శంకర్’కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఆ మధ్య చిత్రీకరించారు.
తదుపరి షెడ్యూల్ ను ఈ నెల 21వ తేదీ నుంచి ప్లాన్ చేశారు. ఆ రోజు నుంచి చిరంజీవి తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారం జరుగుతూ ఉండటంతో దానికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం మేకర్స్ ఈ ప్రకటన చేశారు. చిరంజీవి సరసన నాయికగా తమన్నా కనువిందు చేయనున్నారు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.