ప్రముఖ నటి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి.సరోజా దేవి (87) ఈ రోజు తెల్లవారుజామున బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో NTR, ANR, MGR లాంటి దిగ్గజ నటులతో కలిసి నటించారు.1955లో ‘మహాకవి కాళిదాస’ అనే కన్నడ మూవీతో పరిచయమయ్యారు. తెలుగులో ఇంటికి దీపం ఇల్లాలే, మంచి చెడు, దాగుడు మూతలు, పండంటి కాపురం, దాన వీర శూర కర్ణ, అల్లుడు దిద్దిన కాపురం తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు.
Also Read : Tollywood : టెన్షన్ పడుతున్న తెలుగు హీరోయిన్.. కారణం ఇదే
బి.సరోజా దేవి మృతి పట్ల బాలయ్య విచారం వ్యక్తం చేస్తూ ‘దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఒకనాడు ధ్రువతారగా వెలుగొందిన ప్రముఖ నటీమణి “పద్మభూషణ్” బి. సరోజాదేవి గారు పరమపదించారన్న వార్త అత్యంత బాధాకరం. అప్పట్లో తెలుగులో NTR గారితో, తమిళంలో MGR గారితో, కన్నడంలో రాజ్ కుమార్ గారితో ఏకకాలంలో హిట్ పెయిర్ గా వెలుగొందిన ఘనత ఆమెది. మా తండ్రి NTR గారి కాంబినేషన్లో 20 సంవత్సరాల కాలంలో దాదాపు 20 చిత్రాలలో హీరోయిన్ గా నటించారు. ఆయనతో శ్రీరాముడి ప్రక్కన సీతాదేవిగా, రావణాసురుడి ప్రక్కన మండోదరిగానూ నటించిన ప్రత్యేకత ఆమె సొంతం. శ్రీమతి బి. సరోజా దేవి మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు తీవ్ర విచారకరమైన పరిణామం. ఆమె వెండితెరపై మరియు నిజజీవితంలో చేసిన సేవలు రాబోయే తరాల తారలకు, చలనచిత్ర వర్గాల వారికి స్ఫూర్తినిస్తాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’ అని అన్నారు.