అమరావతి మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది. పాలనా కేంద్రంగానే కాకుండా, ఇప్పుడు అంతర్జాతీయ సినిమా హబ్గా కూడా అవతరించబోతోంది. తాజాగా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముంబై పర్యటనలో భాగంగా పలువురు సినీ దిగ్గజాలతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఆ చర్చల ఫలితంగానే ఇప్పుడు సంజయ్ దత్ బృందం అమరావతికి చేరుకుంది. కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాకుండా, ఏపీలో భారీ పెట్టుబడులు, ముఖ్యంగా సినీ రంగ అభివృద్ధిపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
Also Read:Indian Spy Movies: సరిహద్దులు దాటిన ఇండియన్ సినిమా క్రేజ్.. పాక్లో మన సినిమాలదే హవా!
ఈ భేటీ వెనుక ఉన్న అసలు లక్ష్యం అంతర్జాతీయ స్థాయి ఫిలిం సిటీ నిర్మాణం అని సమాచారం. అమరావతి ప్రాంతంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన స్టూడియోలు, పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు బాలీవుడ్ వర్గాలు ఆసక్తి చూపుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే వేల మంది స్థానిక కళాకారులకు ఉపాధి లభిస్తుంది. ఏపీ పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. హైదరాబాద్, చెన్నైలకు దీటుగా అమరావతి సినిమా రంగంలో ఎదిగే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రితో జరిగిన ఈ సమావేశం అత్యంత సానుకూలంగా సాగినట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే అమరావతిలో సినీ స్టూడియోల ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సంజయ్ దత్ లాంటి అగ్ర నటుడు ఈ ప్రాజెక్టులో భాగస్వామి కావడం, బాలీవుడ్ దృష్టిని అమరావతి వైపు మళ్లించేలా చేస్తోంది.