సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలు అభిమానులకు దగ్గరవుతున్నారు కానీ, అదే సమయంలో కొంతమంది వికృత చేష్టల వల్ల నరకాన్ని కూడా చూస్తున్నారు. తాజాగా నటి ఆయేషా ఖాన్ తనపై జరుగుతున్న బాడీ షేమింగ్, ఎదురవుతున్న రేప్ బెదిరింపుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళగా, ఒక నటిగా తను అనుభవిస్తున్న మానసిక వేదనను పంచుకుంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆయేషా ఖాన్ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె 12వ తరగతి చదువుతున్న సమయంలో ‘టీ-సిరీస్’ రూపొందించిన ఒక పాటలో సెకండ్ లీడ్ రోల్ చేసే అవకాశం వచ్చింది. కానీ, షూటింగ్ ప్రారంభానికి కేవలం ఒక్క రాత్రి ముందు.. ఆమె ‘బరువు ఎక్కువగా ఉంది’ అనే సాకుతో ఆ ప్రాజెక్ట్ నుండి తొలగించారట. ఆ చిన్న వయసులో అది తనపై ఎంతటి ప్రభావం చూపిందంటే.. మళ్ళీ తన రూపంపై తనకు నమ్మకం కలగడానికి చాలా ఏళ్లు పట్టిందని ఆమె ‘వీ ది ఉమెన్’ ఈవెంట్లో పేర్కొన్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో తనకు ఎదురవుతున్న వేధింపుల గురించి ఆయేషా నిర్మొహమాటంగా మాట్లాడారు. “నేను సింపుల్ టాప్ వేసుకున్నా, స్కర్ట్ వేసుకున్నా.. జనం ఎలా రియాక్ట్ అవుతారో అని భయం వేస్తోంది. అందుకే ఏదైనా ఫోటో పోస్ట్ చేసే ముందు వంద సార్లు ఆలోచించాల్సి వస్తోంది. నా కామెంట్ బాక్స్లో అసభ్యకరమైన రాతలు చూస్తుంటే అసలు పోస్ట్ చేయడమే మానేయాలనిపిస్తుంది “ప్రతిరోజూ నాకు రేప్ బెదిరింపులు వస్తున్నాయి. నాతో ఏం చేయాలనుకుంటున్నారో నీచంగా రాస్తున్నారు. ఒకవేళ నేను సెలబ్రిటీని కాకపోయి ఉంటే, ఆ బెదిరింపులు నిజం అయిపోయేవేమో అని భయమేస్తోంది.” “ఈ బెదిరింపులకు అంత బలం ఉంటే వాళ్ళు ఇప్పటికే నేరగాళ్లుగా మారిపోయేవారు.
ఇవి కేవలం కామెంట్స్ కావు, ఇవి నా వ్యక్తిగత భద్రతకు సంబంధించిన విషయం. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను” అని ఆయేషా ఖాన్ స్పష్టం చేశారు. ఆయేషా ఖాన్ ఏక్తా కపూర్ నిర్మించిన ‘కసౌతీ జిందగీ కే’ సీరియల్ ద్వారా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత ‘బాల్వీర్ రిటర్న్స్’లో మెరిశారు. తెలుగులో ఓం భీమ్ బుష్ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్’ చిత్రంలోని ‘స్పెషల్’ సాంగ్ ద్వారా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నారు. సెలబ్రిటీలు కూడా మనుషులే అన్న కనీస స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్న నెటిజన్ల తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయేషా ఖాన్ ధైర్యంగా తన గళం వినిపించడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Telangana Govt Key Decision: మార్చి 8న అసెంబ్లీలో భారీ మార్పులు..!