సినీ తారల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఉంటుంది, ముఖ్యంగా పెళ్లి, ప్రేమ వంటి విషయాల్లో హీరోయిన్ల అభిప్రాయాలు తరచుగా వైరల్ అవుతుంటాయి. తాజాగా మలయాళ ముద్దుగుమ్మ, సౌత్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి వివాహ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీశాయి. తన 34 ఏళ్ల జీవిత ప్రయాణంలో తాను చూసిన పెళ్లిళ్ల గురించి ఐశ్వర్య చాలా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. “నేను ఇప్పటివరకూ చూసిన వైవాహిక జీవితాల్లో నిజమైన సంతోషంతో ఉన్న జంటలు చాలా తక్కువ. పెళ్లి తర్వాత భాగస్వాముల మధ్య వచ్చే విభేదాలు, ఒత్తిడి వారి కెరీర్పై కూడా ప్రభావం చూపుతాయని నేను గమనించాను,” అని ఆమె పేర్కొన్నారు.
Also Read : SS Rajamouli: “ఆ సీన్ అదిరింది రణవీర్”.. ధురందర్ 2పై జక్కన్న రియాక్షన్.. ఆదిత్య ధర్ రిప్లై!
చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత తమ వృత్తిపరమైన ఎదుగుదలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, లక్ష్యాలను చేరుకోవడంలో వెనకబడిపోతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు, ఈ క్రమంలోనే పెళ్లి అనేది జీవితానికి తప్పనిసరి అనే పాత ఆలోచనా ధోరణిని ఆమె పక్కన పెట్టేశారు. పెళ్లి చేసుకోకపోతే జీవితం పరిపూర్ణం కాదు అనే మాటను ఆమె అంగీకరించడం లేదు. అయితే, ఐశ్వర్య లక్ష్మి ప్రేమకు లేదా బంధాలకు వ్యతిరేకం కాదు. “నాకు బంధాల మీద నమ్మకం ఉంది. ఇద్దరు వ్యక్తుల మధ్య మనసులు కలిసినప్పుడు, ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు.. ఆ బంధాన్ని కొనసాగించడానికి ‘పెళ్లి’ అనే ముద్ర అవసరం లేదని నా భావన. అందుకే నేను లైవ్-ఇన్ రిలేషన్షిప్ వైపు మొగ్గు చూపుతున్నాను,” అని స్పష్టం చేశారు. సమాజం ఏమనుకుంటుందో అనే భయం లేకుండా, తన మనసులోని మాటను ధైర్యంగా చెప్పిన ఐశ్వర్య లక్ష్మిపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆమె బోల్డ్ స్టేట్మెంట్ను సమర్థిస్తుంటే, మరికొందరు సంప్రదాయ వివాహ వ్యవస్థ గొప్పతనాన్ని గుర్తు చేస్తున్నారు.