Actress Meena Took Sensational Decision After Husband Vidya Sagar Demise: ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ కొన్ని రోజుల క్రితమే అనారోగ్యం కారణంగా మృతి చెందిన విషయం విదితమే! ఇన్నాళ్లూ ఆ విషాదంలో ఉన్న మీనా.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సినిమా షూటింగుల్లోనూ పాల్గొంటోంది. ఇప్పుడు తాజాగా ఆమె ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే(ఆగస్ట్ 13) సందర్భంగా.. తన అవయవాలను దానం చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రాణాల్ని కాపాడ్డానికి మించిన గొప్ప పని మరొకటి ఉండదని చెప్పిన ఆమె.. మీరు కూడా ఈ గొప్ప నిర్ణయాన్ని తీసుకోండని కోరుతూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
‘‘ప్రాణాలను కాపాడ్డానికి మించిన గొప్ప పని మరొకటి ఉండదు. ప్రాణాల్ని కాపాడే గొప్ప మార్గాల్లో.. అవయవ దానం చేయడం ఒకటి. అనారోగ్యంతో బాధపడే వారికి అవయవాలు దానం చేస్తే, అది వారికి రెండో అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. నేను వ్యక్తిగతంగా ఆ బాధల్ని ఎదుర్కొన్నదాన్నే! నా సాగర్కి కూడా అవయవాలు దానం చేసేవాళ్లు దొరికి ఉండుంటే, ఇప్పుడు పరిస్థితులు మరోలా ఉండేవి. నా జీవితం పూర్తిగా మారిపోయేది. ఒక దాత 8 మంది ప్రాణాలను కాపాడగలుగుతాడు. అవయవ దానం గొప్పదనం గురించి ప్రతిఒక్కరూ అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అవయవ దానం అనేది కేవలం డాక్టర్లు, పేషెంట్ల మధ్య సంబంధం కాదు. ఇది కుటుంబం, స్నేహితులు, సహోద్యుగులపై గొప్ప ప్రభావం చూపుతుంది’’ అంటూ మీనా చెప్పుకొచ్చింది.
చివరగా తానూ తన అవయవాల్ని దానం చేయాలని ప్రతిజ్ఞ తీసుకుంటున్నానని, మన లెగసీని ముందుకు కొనసాగించడానికి ఇదే అత్యుత్తమమైన మార్గమని మీనా వెల్లడించింది. మీనా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక.. భర్త విద్యాసాగర్ ఆకస్మిక మరణమేనని అర్థమవుతోంది. మీనా భర్త చనిపోయింది ఊపిరితిత్తుల సమస్యతో! ఒకవేళ వాటిని మార్చి ఉండుంటే, ఆయన కచ్ఛితంగా బ్రతికేవాడు. కానీ.. ఆ సమయానికి దాతలు దొరక్కపోవడం వల్ల ఆయన మృతి చెందారు. భర్త మరణంతో ఆమె తీవ్రంగా కుంగిపోయింది. ఇతర కుటుంబాల్లో ఇలాంటి విషాద సంఘటనలు చోటు చేసేకోకూడదనే.. అవయవ దానం చేసేందుకు మీనా ముందుకొచ్చింది.