హీరోగా తరుణ్ కెరీర్ లో తొలి చిత్రం ‘నువ్వే కావాలి’తోనే మరపురాని విజయాన్ని అందుకున్నారు. ఆ బ్లాక్ బస్టర్ తరువాత ‘ప్రియమైన నీకు’ వంటి హిట్ తరుణ్ దరి చేరింది. అటు పై తరుణ్ కెరీర్ లో చివరి సూపర్ హిట్ గా ‘నువ్వు లేక నేను లేను’ నిలచింది. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేశ్ బాబు నిర్మించిన ఈ చిత్రం ద్వారా వై. కాశీ విశ్వనాథ్ దర్శకునిగా పరిచయమయ్యారు. 2002 సంక్రాంతి సంబరాల్లో జనం మదిని విశేషంగా దోచుకున్న చిత్రంగా ‘నువ్వు లేక నేను లేను’ నిలచింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే – రాధాకృష్ణ, కృష్ణవేణి ఇద్దరూ చిన్నతనం నుంచీ పోట్లాడుకుంటూ ఉంటారు. వారిద్దరి తండ్రులు మంచి స్నేహితులు. రాధ, కృష్ణ ఇద్దరూ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉందని వారికే తెలియదు. వారి మధ్యలో నీరజ అనే అమ్మాయి రావడంతో ఆ విషయం తెలుస్తుంది. ఇద్దరూ పెద్దలకు చెబుదాం అనుకొనే సమయానికి వారి కన్నతండ్రులు నిర్వహిస్తున్న చిట్స్ కంపెనీ దివాళా తీస్తుంది. జనం వారిపై దాడి చేసే సమయంలో మరో పేరున్న ఫైనాన్స్ కంపెనీ అధినేత రామచంద్రయ్య వచ్చి ఆదుకుంటారు. ఆయన మనవడు కృష్ణవేణిని పెళ్ళాడాలని ఆశిస్తాడు. ఆ విషయం రామచంద్రయ్య చెప్పగానే రాధ, కృష్ణ ఇద్దరి తండ్రులు ఎంతో సంతోషిస్తారు. అయితే రాధ, కృష్ణ ప్రేమ రాధ బామ్మకు మాత్రమే తెలుసు. తమ ప్రేమకంటే తండ్రుల గౌరవం ముఖ్యమని కృష్ణవేణికి రాధ నచ్చచెబుతాడు. కానీ, ఆమె అంగీకరించదు. చివరకు బామ్మ కారణంగా విషయం తెలుసుకున్న రామచంద్రయ్య వారి త్యాగానికి కరిగిపోతారు. రాధ, కృష్ణ ఇద్దరినీ ఆశీర్వదించి పెళ్ళి జరిపించడంతో కథ సుఖాంతమవుతుంది.
కథలో పాతదనమే కనిపించినా, దీనిని దర్శకుడు నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇందులో తరుణ్, ఆర్తి అగర్వాల్, లయ, కిరణ్ రాథోడ్, బ్రహ్మానందం, సురీల్, చంద్రమోహన్, శరత్ బాబు, కె.విశ్వనాథ్, ఆహుతి ప్రసాద్, ఎమ్మెస్ నారాయణ, పరుచూరి వెంకటేశ్వరరావు, గుండు హనుమంతరావు, సుధ, ప్రగతి, లక్ష్మీపతి, రఘునాథ రెడ్డి, సుబ్బరాయ శర్మ, చిత్రం శ్రీను ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి ఆర్.పి.పట్నాయక్ స్వరరచన చేశారు. ఇందులోని “నిండు గోదారి కదా ఈ ప్రేమా…” పాట విశేషాదరణ పొందింది. “నువ్వంటే నాకిష్టం…”, “ఏదో ఏదో…”, “ఎలా ఎలా తెలుపను…” అంటూ సాగే పాటలు కూడా ఆదరణ చూరగొన్నాయి. ఈ చిత్రం కొన్ని కేంద్రాలలో శతదినోత్సవం చూసింది.