ప్రపంచ దేశాలను, ఆర్థిక వ్యవస్థను, అన్ని రంగాలను ఓ కుదుపుకుదిపిన కరోనా మహమ్మారి భయం ఇంకా వెంటాడుతూనే ఉంది.. ఒమిక్రాన్ రూపంలో థర్డ్వేగా భారత్లో విజృంభించిన కోవిడ్ కేసులు ఇప్పుడు భారీగా తగ్గిపోయాయి.. కానీ, కరోనా కరోనా కొత్త వేరియంట్లు కలవరపెడుతూనే ఉన్నాయి.. ఇక, ఇటీవల వెలుగు చూసిన ఒమిక్రాన్లో రెండు సబ్ వేరియంట్లు.. బీఏ 4, బీఏ5 ఆందోళన కలిగిస్తున్నాయి.. కొత్త వేరియంట్ల వ్యాప్తి, ప్రభావంపై దృష్టి సారించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో). కొత్త వేరియంట్ల తీవ్రతపై పర్యవేక్షిస్తోన్న డబ్ల్యూహెచ్వో ఇప్పటివరకు ఉన్న ఒమిక్రాన్ ఉపరకాల కంటే ఇవి భిన్నంగా ఏమీ లేవని తెలిపింది.. ఇదే సమయంలో.. ఈ వేరియంట్లు కచ్చితంగా మార్పు చెందుతాయని స్పష్టం చేసింది. ఇక కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదని.. మనం మహమ్మారి మధ్యలోనే ఉన్నామంటూ వార్నింగ్ ఇచ్చింది డబ్ల్యూహెచ్వో.
Read Also: Power Cuts: వ్యవసాయ విద్యుత్లో కోతలు..! క్లారిటీ ఇచ్చిన ట్రాన్స్కో సీఎండీ
కోవిడ్లో పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ వేరియంట్కు సంబంధించి రెండు కొత్త వేరియంట్లను ఇప్పటికే గుర్తించాం.. మునుపటి రకాలతో పోలిస్తే తీవ్రతలో ఎటువంటి మార్పులను గుర్తించలేదని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కానీ, ఇది మార్పు చెందే అవకాశం లేకపోలేదని హెచ్చరించింది.. వాటి వాస్తవ పరిస్థితులపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులతో కలిసి పనిచేస్తున్నట్టు డబ్ల్యూహెచ్వో ప్రతినిధి మారియా వాన్ కెరోవ్ తెలిపారు.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ తక్కువగానే ఉన్నప్పటికీ.. ఇది ప్రజారోగ్య ముప్పుగానే కొనసాగిస్తున్నట్లు డబ్ల్యూహెచ్వో ఎమర్జెన్సీ కమిటీ పేర్కొన్న విషయం విదితమే.