పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా అమెరికా-ఇరాన్ల మధ్య వార్నింగ్లు.. బెదిరింపులు జరుగుతున్నాయి. డిసెంబర్ 28న ఇరాన్లో మొదలైన నిరసనల దగ్గర నుంచి ఇప్పటి దాకా ఉద్రిక్తతలే కొనసాగుతున్నాయి. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. భద్రతా కాల్పుల్లో 30 వేల మంది నిరసనకారులు చనిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ను అగ్ర రాజ్యం అమెరికా తీవ్రంగా వార్నింగ్ ఇచ్చింది. అంతేకాకుండా ఇరాన్ సమీపంలోకి అమెరికా యుద్ధ నౌకలు కూడా చేరుకున్నాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం ఉంది.
ఇది కూడా చదవండి: Telangana BJP: బీజేపీకి జనసేన సపోర్ట్.. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్..
ప్రస్తుతం అరేబియా సముద్రంలో అమెరికాకు చెందిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన నౌక మోహరించి ఉంది. అయితే మంగళవారం ఈ నౌక సమీపంలోకి ఇరానియన్ డ్రోన్ రాబోతుండగా అమెరికా సైన్యం అప్రమత్తమై కూల్చేసింది. ఆత్మ రక్షణ కోసం డ్రోన్ను కూల్చేసినట్లుగా అమెరికా సైన్యం పేర్కొంది. అయితే అమెరికా-ఇరాన్ చర్చలకు సిద్ధపడుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ఉద్రిక్తతలు మొదలవుతాయేమోనన్న ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి: Megna Mukharjee: సౌరవ్ గంగూలీతో యాడ్లో నటించి.. టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ!
అబ్రహం లింకన్ నౌక ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఇరాన్ దక్షిణ తీరానికి 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఈ నౌక దగ్గరకు ఇరాన్ డ్రోన్ సమీపిస్తుండగా పేల్చేశారు. ఈ ఘటనలో అమెరికా సిబ్బంది ఎవరూ గాయపడలేదని.. సైనిక పరికరాలు కూడా ఏమీ దెబ్బతినలేదని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే డ్రోన్ కూల్చివేతపై ఇరాన్ ఇంకా స్పందించలేదు.
మరోవైపు శుక్రవారం అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వేదిక పరిశీలనలో ఉంది. టర్కీ లేదా ఒమన్ సహా అనేక దేశాలు పరిశీలనలో ఉన్నాయి. ట్రంప్ ప్రత్యేక అధికారి స్టీవ్ విట్కాఫ్ ఈ వారం ఇరాన్ అధికారులతో చర్చలు జరపవచ్చని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ తెలిపారు.