ఇరాన్-అమెరికా మధ్య అణు చర్చల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో పాలన మార్పు ఉత్తమ చర్యగా స్పష్టం చేశారు. నార్త్ కరోలినాలో అమెరికా దళాలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. ‘‘కొన్ని సార్లు భయం అవసరం. అది మాత్రమే పరిస్థితులను మెరుగుపరుస్తుంది.’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పటికే మేము చాలా పెద్ద క్యారియర్ సముహాన్ని పంపాము. నేను ఒక ఒప్పందం చేసుకోవాలనుకున్నాను. కానీ వారితో వ్యవహరించడం కష్టంగా మారింది. ఒక ఒప్పందానికి వస్తారనుకుంటే రాలేదు. ఏం చేస్తాం.. మిడ్నైట్ హామర్లో మేము అదే చేస్తాం.’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
గత కొద్ది రోజులుగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డిసెంబర్ 28 నుంచి ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. నిరసనకారుల్ని అడ్డుకునే క్రమంలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 30 వేల మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో హత్యలు ఆపకపోతే దాడి చేయాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నడుస్తున్నాయి. తాజాగా అణు ఒప్పందం చేసుకోవాలని అమెరికా ఒత్తిడి చేస్తోంది. కానీ అందుకు ఇరాన్ నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్పై దాడి చేసేందుకు అమెరికా ప్రణాళికలు రచిస్తోంది.
ఇప్పటికే అరేబియా సముద్రంలో యూఎస్ అబ్రహం లింకన్ నౌకతో పాటు యూఎస్ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్ జూనియర్, యూఎస్ఎస్ స్ప్రూయాన్స్ డెస్ట్రాయర్లు, యూఎస్ఎస్ మిషెల్ మార్ఫీలు మోహరించినట్లు తెలుస్తోంది. తాజాగా కరేబియన్ నుంచి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ సైతం అరేబియాకు వెళ్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో తీవ్ర సంఘర్షణ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
రాయిటర్స్ నివేదిక ప్రకారం.. అమెరికా సైన్యం కొన్ని వారాల పాటు ఇరాన్పై దాడి చేయొచ్చని తెలుస్తోంది. ట్రంప్ ఆదేశిస్తే మునుపెన్నడూ లేనంతగా దాడి జరగొచ్చని పేర్కొంది. పెద్ద స్థాయిలో అమెరికా సైన్యం తరలివెళ్తు్న్నట్లుగా ఇద్దరు అధికారులు చెప్పినట్లుగా వెల్లడించింది.
మిడ్నైట్ హామర్ కంటే భిన్నమైన వ్యూహం
గత సంవత్సరం అమెరికా ఇరాన్పై దాడి చేసింది. అణు కేంద్రాలపై పరిమిత ఆపరేషన్ చేసింది. దీన్ని మిడ్నైట్ హామర్గా పిలుస్తారు. స్టెల్త్ బాంబర్లు అమెరికా నుంచి నేరగా ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసి తిరిగొచ్చేశాయి. ఈసారి అలా కాకుండా అణు స్థావరాలతో పాటు ఇరాన్ ప్రభుత్వాన్ని.. భద్రతా సౌకర్యాలను దెబ్బకొట్టనుంది. ఏం జరుగుతుందో చూడాలి
