వెనిజులా చమురుపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. మార్కెట్ ధరకే వెనిజులా నుంచి 30 మిలియన్ల నుంచి 50 మిలియన్ల బ్యారెళ్ల చమురు కొనుగోలు చేస్తామని తెలిపారు. చమురు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని రెండు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తానని తెలిపారు.
వెనిజులాలోని తాత్కాలిక అధికారులు 30 మిలియన్ల నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల హై క్వాలిటీ చమురును అమెరికాకు మార్కెట్ ధరకు విక్రయిస్తారని మంగళవారం ట్రంప్ తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ‘‘ఈ ప్రణాళికను వెంటనే అమలు చేయాలని నేను ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్ను కోరాను. చమురు నౌకలు నేరుగా యునైటెడ్ స్టేట్స్లోని అన్లోడింగ్ డాక్లకు తీసుకువస్తాయి.’’ అని ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ స్పష్టం చేశారు.
ఇక వెనిజులాకు సంబంధించిన చమురు కంపెనీల కార్యనిర్వాహకులతో శుక్రవారం వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్లో ట్రంప్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎక్సాన్, చెవ్రాన్, కోనోకోఫిలిప్స్ ప్రతినిధులు హాజరుకానున్నారు. భవిష్యత్ ప్రణాళికలపై ప్రతినిధులతో ట్రంప్ చర్చిస్తారని ఈ విషయం గురించి తెలిసిన వ్యక్తి వెల్లడించారు.
గత శనివారం వెనిజులాపై అమెరికా సైన్యం దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకొచ్చారు. అనంతరం డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉంటే అమెరికా సైనిక దాడిలో 32 మంది వెనిజులా భద్రతా అధికారులు చనిపోయినట్లుగా నివేదికలు అందుతున్నాయి.
