ఇరాన్-అమెరికా మధ్య మరోసారి యుద్ధం జరగబోతుందా? ఈసారి పరిస్థితులు మరింత చేజారబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత కొద్దిరోజులుగా రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. అయితే శాంతి చర్చలపై మాత్రం పంచాయితీ తెగడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్పై మండిపడ్డారు.
ఇరాన్తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అత్యంత సంక్షోభ పరిస్థితిలో ఉందని హెచ్చరించారు. ఇరాన్ తాజా ప్రతిపాదనను తిరస్కరించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం “లైఫ్ సపోర్ట్పై ఉన్నట్టే” ఉందని పేర్కొన్నారు. అణు చర్చలు నిలిచిపోవడంతో ఈ సున్నితమైన ఒప్పందం ఎప్పుడైనా కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అమెరికా మద్దతుతో వచ్చిన శాంతి ప్రతిపాదనకు ఇరాన్ ఇచ్చిన సమాధానం అసంబద్ధంగా ఉందన్నారు. కీలక అణు రాయితీలు అందులో లేవని ఆరోపించారు. ఇరాన్ పంపిన ప్రతిస్పందనను పూర్తిగా చదవలేదని.. అది “చెత్త పత్రం” లాంటిదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాదాపు 10 వారాలుగా కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పుడు అత్యంత బలహీన స్థితిలో ఉందన్నారు.
‘‘ప్రస్తుతం ఇది అత్యంత బలహీనమైన ఒప్పందం. ఇది లైఫ్ సపోర్ట్పై ఉంది.’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. పరిస్థితిని విషమ స్థితిలో ఉన్న రోగితో పోల్చుతూ.. ఈ ఒప్పందం నిలబడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు.
మరోవైపు ఇరాన్ తమ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకోవడానికి సిద్ధంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. దీనిని “న్యూక్లియర్ డస్ట్”గా అభివర్ణించారు. ఆ యురేనియంను స్వాధీనం చేసుకునే సాంకేతిక సామర్థ్యం అమెరికా, చైనాకు మాత్రమే ఉందని తెలిపారు.
ఇటీవల ఇరాన్తో చర్చలు పునఃప్రారంభించేందుకు అమెరికా ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. అయితే ఆదివారం ఇరాన్ ఇచ్చిన సమాధానంలో లెబనాన్లో హిజ్బుల్లా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణలు సహా పలు ప్రాంతాల్లో శత్రుత్వ చర్యలను నిలిపివేయాలని ప్రధానంగా కోరినట్లు సమాచారం. అలాగే యుద్ధ నష్టాలకు పరిహారం చెల్లించాలని.. హార్ముజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని, అమెరికా నౌకాదళ ఆంక్షలను ఎత్తివేయాలని, ఇరాన్పై విధించిన ఆంక్షలను తొలగించాలని, చమురు ఎగుమతులపై ఉన్న పరిమితులను రద్దు చేయాలని టెహ్రాన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
