PAK Beggars: తాము ఏ మిత్రదేశానికి వెళ్లినా.. అడుక్కోవడానికే వచ్చామన్నట్లు చూస్తున్నారని.. మూడేళ్ల క్రితం ప్రస్తుత పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఓ సమావేశంలో వ్యాఖ్యానించాడు. ఆయన అప్పుడు ఏ ఉద్దేశంతో అన్నారో గానీ.. దాని మిత్ర దేశాలను మాత్రం పాక్ బిచ్చగాళ్లు భయ పెడుతున్నారు. యాచకులను ఎగుమతి చేసే దేశంగా అపకీర్తిని సొంతం చేసుకుంది. అయితే, తాజాగా సౌదీ అరేబియాలో పాక్ కు చెందిన 5,033 మంది బిచ్చగాళ్లను వారి స్వదేశానికి బలవంతంగా తిరిగి పంపించింది. మరో 369 మందిని ఇతర దేశాలకు అప్పగించేసింది. ఈ విషయాన్ని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహసిన్ నక్వీ ఇటీవల నేషనల్ అసెంబ్లీలో ప్రసంగించినట్లు డాన్ పత్రిక కథనంలో రాసుకొచ్చింది.
ఇక, 2024 జనవరి నుంచి తమ మిత్ర దేశాలు తరిమేసిన పాక్ బిచ్చగాళ్ల సంఖ్యను ఇప్పటి వరకు 5,402కు చేరుతుంది. వీరిని సాగనంపిన వారిలో సౌదీ, ఇరాక్, మలేసియా, ఒమన్, ఖతార్, యూఏఈ దేశాలు ఉన్నాయి. ఈ మొత్తంలో సింధి ప్రావిన్స్కు చెందినవారు సుమారు 2,795 మంది ఉండగా.. పంజాబ్ ప్రావిన్స్ నుంచి 1,437, కేపీ నుంచి 1,002, బలూచిస్థాన్ 125, పీవోకే 33, మరో 10 మంది ఇస్లామాబాద్ నుంచి ఉన్నారని తేలింది. ఏప్రిల్ 19న సియాల్కోట్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసీఫ్ మాట్లాడుతూ.. దేశంలో బిచ్చగాళ్లు ఓ పెద్ద సమస్యగా మారిపోయిందన్నారు. దీంతో ఇతర దేశాలు వీసాలు జారీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ లో దాదాపు 2 కోట్ల మంది యాచకులు ఉన్నట్లు తేలింది.. వీరి నెలసరి ఆదాయం 4,200 కోట్ల పాకిస్థానీ రూపాయిలు అని అతడే అందరి ముందు వెల్లడించారు. సియాల్ కోట్ నుంచి వారిని రెండుసార్లు పంపించగా.. మళ్లీ తిరిగి వచ్చారని అన్నాడు.